స్కోర్స్​ ద్వారా 4 వేలకు పైగా ఫిర్యాదుల పరిష్కారించిన సెబీ

స్కోర్స్​ ద్వారా 4 వేలకు పైగా ఫిర్యాదుల పరిష్కారించిన సెబీ

న్యూఢిల్లీ: - మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఈ ఏడాది మార్చి నెలలో  స్కోర్స్​ ఫ్లాట్​ఫారమ్​ ద్వారా 4,371 ఫిర్యాదులను పరిష్కరించింది. మధువీర్ కామ్18 నెట్‌‌వర్క్ లిమిటెడ్,  నిఖిల్ దయానంద్ బల్జేకర్ అనే సంస్థలకు సంబంధించిన మూడు ఫిర్యాదులు మాత్రమే మార్చి చివరి నాటికి స్కోర్స్​ లో మూడు నెలల కంటే ఎక్కువ కాలం పెండింగ్‌‌లో ఉన్నాయని తెలిపింది. 

సెబీ డేటా ప్రకారం, ఫిబ్రవరి 28 నాటికి 4,376 ఫిర్యాదులు పెండింగ్​లో ఉన్నాయి. మార్చిలో 4,156 కొత్త ఫిర్యాదులను తీసుకుంది. మార్చి 31 నాటికి మొత్తం 4,161 ఫిర్యాదులు పరిష్కారం కాలేదు. యాక్షన్​టేకెన్​రిపోర్ట్స్​ (ఏటీఆలు) సమర్పించడానికి సగటున తొమ్మిది రోజులు పట్టిందని సెబీ తెలిపింది. అప్‌‌గ్రేడ్ అయిన స్కోర్స్​ 2.0 ఫ్రేమ్‌‌వర్క్ కింద ఫిర్యాదులు సంబంధిత సంస్థకు ఆటోమేటిక్​గా వెళ్తాయి. ఈ దశలో ఏటీఆర్​ని సమర్పించడానికి 21 రోజులు సమయం ఇస్తారు. సంతృప్తి చెందని వాళ్లు 15 రోజుల్లో మొదటి స్థాయి సమీక్షను ఎంచుకోవచ్చు. 

ఈ కాలంలో  ఏటీఆర్​ సమర్పించినప్పటికీ, ఫిర్యాదులు పెండింగ్ జాబితాలో ఉంటాయి. అప్పటికీ సంతృప్తి చెందకపోతే సెబీ ద్వారా రెండో స్థాయి సమీక్ష కోరవచ్చు. అంతేకాకుండా, ఆన్‌‌లైన్ వివాదాల పరిష్కార (ఓడీఆర్​) విధానాన్ని ఎంచుకునే అవకాశం కూడా ఉంటుంది.    2011 జూన్​లో ప్రారంభమైన స్కోర్స్ కంపెనీలు, మధ్యవర్తులు,  మార్కెట్ మౌలిక సదుపాయాల సంస్థలపై సెక్యూరిటీల మార్కెట్‌‌కు సంబంధించిన ఫిర్యాదులను ఆన్‌‌లైన్‌‌లో నమోదు చేయడానికి, పెట్టుబడిదారులకు సహాయపడటానికి ఉపయోగపడుతుంది. గత ఏడాది ఏప్రిల్‌‌లో సెబీ అదనపు ఫీచర్లతో ప్లాట్‌‌ఫారమ్  కొత్త వెర్షన్ స్కోర్స్​ 2.0ని ప్రారంభించింది.