ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో మరో డెడ్​బాడీ లభ్యం

ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో  మరో డెడ్​బాడీ లభ్యం
  • ప్రాజెక్ట్​ ఇంజనీర్​ మనోజ్​కుమార్​గా గుర్తింపు
  • మరో ఆరుగురి ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ
  • పోస్ట్​మార్టం అనంతరం స్వగ్రామానికి మృతదేహం తరలింపు

నాగర్​కర్నూల్/ఉప్పునుంతల, వెలుగు:ఎస్ఎల్​బీసీ టన్నెల్​ నుంచి మంగళవారం ప్రాజెక్ట్​ ఇంజనీర్​ మనోజ్​కుమార్(50) డెడ్ బాడీని వెలికితీశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో టన్నెల్​ చివర 60 మీటర్ల దూరంలో కన్వేయర్​ బెల్ట్  డ్రమ్​ దగ్గర మట్టిలో కూరుకుపోయిన లోకో ఇంజన్​ సమీపంలో మనోజ్ కుమార్​ డెడ్ బాడీ గుర్తించారు. దుర్వాసన రావడంతో రెస్క్యూ బృందాలు ఐరన్​ పార్ట్స్​ తొలగించి డెడ్​బాడీ ఉన్నట్లు నిర్దారించుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. 

మంగళవారం ఉదయం షిప్టులో డాక్టర్లు, పారా మెడికల్​ బృందాలతో టన్నెల్​ లోపలికి వెళ్లిన టీం లోకో ట్రైన్​లో డెడ్​బాడీని బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్​లో నాగర్​కర్నూల్​ జిల్లా జనరల్​ ఆసుపత్రికి తరలించారు. మృతుడు మనోజ్​కుమార్​ జేపీ అసోసియేట్స్​ కంపెనీలో ప్రాజెక్ట్​ ఇంజనీర్​గా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని ఉన్నావ్​  జిల్లా బంగార్మౌ గ్రామానికి చెందిన మనోజ్​కు భార్య స్వర్ణలత, కొడుకు ఆదర్శ్, కూతురు శైలజ, తల్లి జమునా దేవి ఉన్నారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో మట్టిలో కూరుకుపోయిన డెడ్​బాడీ  వేలికి ఉన్న ఉంగరం, మెడలోని చైన్, ప్యాకెట్​లో ఉన్న మొబైల్  ద్వారా మనోజ్ కుమార్​గా​ గుర్తించారు.

17 రోజుల తరువాత రెండో డెడ్​బాడీ..

టీబీఎం ఎరక్టర్  గురుప్రీత్​సింగ్​ డెడ్​బాడీ దొరికిన 17 రోజుల తరువాత మనోజ్​కుమార్​ మృతదేహం లభ్యమైంది. గత నెల 22న జరిగిన ఎస్ఎల్​బీసీ టన్నెల్​ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మందిని రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్​లో పలు అవాంతరాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి ఈ నెల 9న డి2 పాయింట్  వద్ద గురుప్రీత్​సింగ్​ డెడ్​బాడీని గుర్తించారు. ఎన్జీఆర్ఐ, క్యాడవర్​ డాగ్స్​ స్క్వాడ్​ గుర్తించిన డి1, డి2 ప్రదేశాల్లో మిగిలిన వారి ఆచూకీ కోసం టీబీఎం మెషీన్​ను కట్​ చేయడంతో పాటు మట్టి, రాళ్లు, బురదను బయటికి తోడేశారు. 

టన్నెల్​ చివరి నుంచి దాదాపు 300 మీటర్ల వరకు వెనక్కి కొట్టుకొచ్చిన 1,500 టన్నుల బరువు ఉన్న టీబీఎం భాగాలు విరిగిపోయి టన్నెల్​లో అడ్డంగా పడిపోయాయి. 9.55 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న టన్నెల్​లో 9 మీటర్ల వరకు మట్టి, రాళ్లతో నిండిపోయింది. 32 రోజుల పాటు కొనసాగిన  రెస్య్కూ ఆపరేషన్​లో పాల్గొన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా, రైల్వే, ఫైర్, జేపీ అసోసియేట్స్​ కంపెనీ​ సిబ్బందికి ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, బీఆర్వో, ఐఐటీ చైన్నై వంటి సంస్థల ఉన్నతాధికారులు సహకరించారు. 

193 మీటర్ల మట్టిని తీయాల్సిందే..

14 కిలోమీటర్ల పొడవు ఉన్న టన్నెల్​ చివరలో ప్రమాదం జరిగిన సమయంలో పని చేస్తున్న 50 మందిలో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. టీబీఎం పక్కన, పరిసరాల్లో పని చేస్తున్న 8 మంది అందులో చిక్కుకుకున్నారు. కూలిన మట్టి, నీటి ఊట ధాటికి టన్నెల్​ చివరి నుంచి 300 మీటర్ల వెనక్కి కొట్టుకొచ్చిన టీబీఎం పాక్షికంగా ధ్వంసమైంది. కన్వేయర్​ బెల్ట్​ డ్రమ్, ఎయిర్​ పంప్  వెంటిలెట్స్, ఆక్సిజన్ ప్లాంట్​ పనికి రాకుండా పోయాయి. 8 మంది చిక్కుకున్న ప్రాంతాలను డి1, డి2, ఎ5గా గుర్తించిన అధికారులు అక్కడి నుంచి మట్టి తవ్వకాలు, రాళ్ల తరలింపు చేపట్టారు. 

టీబీఎం బ్యాక్​ పార్ట్​ను గ్యాస్, ప్లాస్మా కటర్లతో కట్​ చేశారు.​ టన్నెల్​ చివరి నుంచి 43 మీటర్ల దూరంలో డి1 పాయింట్​, ఇక్కడి నుంచి 20 మీటర్ల దూరంలో డి2 పాయింట్​గా గుర్తించారు. డి2 నుంచి 253 మీటర్ల దూరంలో  కన్వేయర్​ బెల్ట్ ఉంటుంది. దీని సమీపంలోనే లోకో ఇంజన్​ మట్టిలో కూరుకుపోయింది. నీటి ఊటతో అత్యంత ప్రమాదకరంగా మారిన డి1, డి2 ప్రాంతాల నుంచి ఇవతలి వైపు మట్టి, రాళ్లు జారకుండా స్టీల్​ మెస్  బిగించామని సింగరేణి జీఎం బైద్య వివరించారు.​ 253 మీటర్ల పొడవునా పేరుకుపోయిన మట్టి, రాళ్లలో.. 60 మీటర్ల వరకు తొలిగించామని, మిగిలిన 193 మీటర్ల మట్టి,రాళ్లను తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. 

కార్మికులతో పాటు నాలుగు ఎస్కవేటర్లు పని చేయడంతో మట్టి, రాళ్ల తొలగింపులో స్పీడ్​ పెరిగిందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఏప్రిల్​ 10 వరకు రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగిస్తామని తెలిపారు. డిజాస్టర్​ స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ అర్వింద్​ కుమార్​ రెస్క్యూ ఆపరేషన్​ను పర్యవేక్షిస్తుండగా, తెలంగాణ, ఏపీ సబ్  ఏరియా జనరల్  కమాండింగ్  ఆఫీసర్​ అజయ్ మిశ్రా, ఎన్డీఆర్ఎఫ్​కు చెందిన పరీక్షిత్​ మెహ్రా తదితరులు రెగ్యులర్​ మానిటర్​ చేస్తున్నారు.

స్వగ్రామానికి డెడ్​బాడీ..

ప్రాజెక్ట్  ఇంజనీర్  మనోజ్ కుమార్  మృతదేహనికి నాగర్​కర్నూల్​ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించారు. కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ, ఇరిగేషన్, హెల్త్  డిపార్ట్ మెంట్లకు చెందిన ముగ్గురు ఆఫీసర్లు, పోలీస్  ఎస్కార్ట్ తో ప్రత్యేక వాహనంలో డెడ్​బాడీ పంపించారు. మనోజ్ కుమార్  ఫ్యామిలీకి రాష్ట్ర సర్కారు ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం చెక్కును ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అధికారులకు అందజేశారు.