మాటిమాటికి చంపుతా అని బెదిరిస్తే.. భయంతో అతన్నే చంపేశాడు

మాటిమాటికి చంపుతా అని బెదిరిస్తే.. భయంతో అతన్నే చంపేశాడు

సికింద్రాబాద్, వెలుగు: తనతో కలిసి పనిచేస్తున్న వ్యక్తి డబ్బులు లాక్కొని, చంపుతానని బెదిరిస్తుండడంతో సహనం కోల్పోయి అతడిని హత్య చేసిన నిందితుడిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే డీఎస్పీ జావేద్, సీఐ సాయిఈశ్వర్​గౌడ్​కలిసి బుధవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. గుజరాత్​కు చెందిన నిషాద్​రామ్​అలియాస్ కనడ రాజు(37) బన్సీలాల్​పేట్​లో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. మధ్య ప్రదేశ్​కు చెందిన సుభాష్​ బహేశ్వర్ ​మెట్టుగూడలో ఉంటూ రైల్వే కాంట్రాక్టర్ ​వద్ద సెంట్రింగ్ ​పనులు చేస్తున్నాడు. 

నిషాద్​రామ్​ గతంలో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చాడు. వీరిద్దరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో​పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో నిషాద్​రామ్ చాలా రోజులుగా  సుభాష్​ను​ బెదిరించి అతని వద్ద ఉన్న డబ్బులు లాక్కుని జల్సాలు చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే చంపుతానని బెదిరించి మరీ జీతం డబ్బులు  లాక్కున్నాడు. 

తనను ఎదుర్కొనే ధైర్యం ఉంటే  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​ ప్లాట్​ఫామ్​ నంబరు 10 వద్దకు రావాలని  సవాల్​ విసిరాడు. దీంతో నిషాద్​పై పగ పెంచుకున్న సుభాష్ ఈ నెల 20న అక్కడికి వెళ్లి కర్రతో దాడి చేసి, పరారయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో నిషాద్​ అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.