సికింద్రాబాద్ ​రైల్వే స్టేషన్​లో ఆరు ప్లాట్​ఫాంలు బంద్

సికింద్రాబాద్ ​రైల్వే స్టేషన్​లో   ఆరు ప్లాట్​ఫాంలు బంద్
  • 100 రోజుల వరకు మూసివేత
  • స్టేషన్​ ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్ణయం
  • చర్లపల్లి, కాచిగూడ, మల్కాజిగిరి, నాంపల్లి నుంచి బయల్దేరనున్న రైళ్లు

హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్  ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేషన్​లోని ఆరు ఫ్లాట్​ఫాంలను 100 రోజుల పాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ పనుల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా కొన్ని రైళ్లను పలు స్టేషన్లకు తరలించారు. సికింద్రాబాద్–విజయవాడ మధ్య నడిచే శాతవాహన ఎక్స్​ప్రెస్​ ఇక నుంచి కాచిగూడ స్టేషన్  నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, సికింద్రాబాద్–పోరుబందర్​ మధ్యనడిచే పోరుబందర్​ఎక్స్​ ప్రెస్​ కూడా కాచిగూడ నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్–​ సిద్దిపేటకు నడిచే సిద్దిపేట డీఎంయూ ఇక నుంచి మల్కాజిగిరి స్టేషన్  నుంచి బయల్దేరుతుంది. 

సికింద్రాబాద్–పూణె మధ్య నడిచే పూణె ఎక్స్​ప్రెస్​ నాంపల్లి స్టేషన్​ నుంచి ప్రారంభమవుతుంది. సికింద్రాబాద్​–మణుగూరు మధ్య నడిచే సికింద్రాబాద్​ ఎక్స్​ప్రెస్​ ఇక చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. సికింద్రాబాద్–రేపల్లె మధ్య నడిచే సికింద్రాబాద్​ ఎక్స్​ప్రెస్​  చర్లపల్లి నుంచి స్టార్ట్  అవుతుంది. సిల్చార్–సికింద్రాబాద్​ మధ్య నడిచే సిల్చార్​ ఎక్స్​ప్రెస్​  తాజాగా చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుంది. సికింద్రాబాద్–దర్భంగా మీదుగా నడిచే సికింద్రాబాద్​ ఎక్స్​ప్రెస్​ ఇక నుంచి చర్లపల్లి నుంచి స్టార్ట్  అవుతుంది. 

సికింద్రాబాద్–యశ్వంత్​పూర్​ మధ్య నడిచే సికింద్రాబాద్​ ఎక్స్​ప్రెస్..​ చర్లపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుంది. తిరుపతి–ఆదిలాబాద్​ మధ్యనడిచే తిరుపతి ఎక్స్​ప్రెస్​ చర్లపల్లి మీదుగా నడుస్తుందని అధికారులు తెలిపారు. లింగంపల్లి– కాకినాడ మీదుగా నడిచే లింగంపల్లి ఎక్స్​ ప్రెస్​ చర్లపల్లి, అమ్ముగూడ మీదుగా రాకపోవకలు సాగిస్తుందని వెల్లడించారు. కాజిపేట–హడాప్సర్​ మీదుగా నడిచే కాజిపేట ఎక్స్​ ప్రెస్​ చర్లపల్లి, అమ్ముగూడ  మీదుగా రాకపోకలు సాగిస్తుంది. లింగంపల్లి–విశాఖపట్నం మధ్య నడిచే లింగంపల్లి ఎక్స్​ప్రెస్..​ చర్లపల్లి, అమ్ముగూడ మీదుగా ప్రయాణిస్తుంది. సికింద్రాబాద్​–కర్నూల్​ మధ్య నడిచే తుంగభద్ర ఎక్స్​ ప్రెస్.​. కాచిగూడ నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.