
తిరుమలలో భద్రతపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రోన్ ఘటన మరువక ముందే సీఎంఓ స్టిక్కరున్న వాహనం మాడ వీధుల్లోకి రావడం సంచలనం సృష్టించింది. మూడంచెల భద్రతను దాటి కారు పుష్కరిణి సమీపంలోకి వెళ్లినా టీటీడీ సెక్యూరిటీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్బగీచ వద్ద ఉన్న చెక్ పోస్ట్ నుంచి వీఐపీ వాహనాలతో పాటు టీటీడీకి చెందిన కార్లను లోపలికి అనుమతిస్తుంటారు. అయితే రామ్బగీచ నుంచి శ్రీవారి పుష్కరిణి మధ్య మూడు చెక్పోస్టులు ఉంటాయి. ఈ వాహనాల్లో ఎవరెవరున్నారో క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే వీఐపీ వాహన పార్కింగ్ స్టాండ్ వద్దకు పంపుతుంటారు. అంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ సీఎంఓ స్టిక్కరున్న వాహనం పుష్కరిణి వరకు వెళ్లడం మరోసారి చర్చకు దారితీసింది.