వరంగల్, వెలుగు: గత ఎన్నికల్లో ప్రజలు కన్ఫ్యూజన్ లోబీఆర్ఎస్ నుఓడించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. లోకల్ఇష్యూస్ తోపాటు ఇతర అంశాల వల్ల ఇలాంటి తీర్పు ఇచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ కు, కాంగ్రెస్కు1.7 శాతం ఓట్ల తేడా మాత్రమే ఉందని, కాంగ్రెస్ను ఉప్పెనలాగా గెలిపించుడో, మమ్మల్ని తిరస్కరించుడో జరగలేదని ఆమె స్పష్టం చేశారు. అయినా ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తామని, ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరిస్తామని వెల్లడించారు. 100 రోజలు సమయమివ్వాలని తమ నాయకుడు చెప్పారని, ఆ తర్వాత కార్యచరణ ఉంటదని చెప్పారు.
ఈ మేరకు శనివారం కవిత వరంగల్ జిల్లాలో పర్యటించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి ప్రెస్మీట్లో మాట్లాడారు. ప్రభుత్వం ఆరోపించినట్లు ల్యాండ్ క్రూయిజర్లు తాము కొనలేదని, వాటి కొనుగోలు పోలీస్ సెక్యూరిటీ, ఇంటలిజెన్స్ తీసుకున్న నిర్ణయమని, అది భద్రతకు సంబంధించి సీక్రెట్ అని కవిత చెప్పారు. ఆ వాహనాలను కేసీఆర్విజయవాడలో దాచిపెట్టారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయిని తగ్గించుకోవడమే అన్నారు.
కాళేశ్వరంపై విచారణకు సిద్ధం..
కాళేశ్వరం ప్రాజెక్ట్పై విచారణకు తాము సిద్దమని ఇదివరకే ప్రకటించినట్టు కవిత చెప్పారు. ఇంకా ఎలాంటి విచారణ జరగకుండానే మంత్రులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. ఈ విషయంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్పిందే తమ స్టాండ్ అని కవిత అన్నారు. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది తమ పార్టీ హైకమాండ్ నిర్ణయమన్నారు. అబద్దాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పరిస్థితి ఎన్నోరోజులు ఉండబోదన్నారు. 6 గ్యారంటీలపై క్లారిటీ ఇవ్వకుండా దరఖాస్తులు తీసుకుని కాలయాపన చేసే కుట్ర జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి కావాల్సిన సమాచారం అందుబాటులో ఉన్నా.. మరోసారి దరఖాస్తుల పేరుతో టైమ్వేస్ట్చేస్తోందని ఆరోపించారు. జనాల్లో ఎన్నో సందేహాలు ఉన్నట్లు చెప్పారు. దరఖాస్తుల్లో బ్యాంక్ అకౌంట్ లేకుండా పెన్షన్, రైతుబంధు ఎలా వేస్తారో అర్థం కావడం లేదని అన్నారు. పురుషులతో పేరుతో గ్యాస్ ఉన్నవారు ఏంచేయాలో అర్థం కావడం లేదన్నారు.
మా వల్లే ట్రైబల్ వర్సిటీ వచ్చింది..
రాష్ట్రంలో ప్రజలు జనవరిలో వచ్చే కరెంట్ బిల్లులు కట్టొద్దని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తామని చెప్పిందని.. ఈ లెక్కన డిసెంబర్ నెల వినియోగించుకున్న బిల్లును కట్టకుండా ఉండటమే బెటర్ అన్నారు. మేడారం జాతర కొచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు వేయడమో.. లేదంటే బస్సుల సంఖ్య పెంచడమో చేయాలన్నారు.
పెంచిన రైతుబంధు, పెన్షన్లతో పాటు పెండింగ్లో ఉన్నవాటిని జనవరి1 నుంచి ఇవ్వాలన్నారు. ఉద్యమకారులకు పథకాలు వర్తించాలంటే ఎఫ్ఐఆర్ కాపీలు అడగటమేంటని ప్రశ్నించారు. దరఖాస్తుల్లో నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు మేడారం జాతరను పట్టించుకోలేదని.. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రూ.75 కోట్లు కేటాయించిందన్నారు. తమ పోరాటంవల్లే ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ వచ్చిందని.. రూ.850 కోట్ల ఆ ప్రాజెక్ట్ వస్తే ఎందరికో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.