![నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల దందా](https://static.v6velugu.com/uploads/2020/02/plat.jpg)
- ఎస్వోటీ పోలీసుల అదుపులో డాక్యుమెంట్ రైటర్, మరో నలుగురు
- రెండు తెలుగు రాష్ట్రాల్లో బాధితులు, నిందితులు
నకిలీ ఆధార్, పాన్కార్డులను సృష్టించి ఇతరుల ప్లాట్లను దశాబ్దకాలంగా అమ్మేస్తున్న ఓ రియల్ఎస్టేట్, ప్రజాప్రతినిధుల ముఠాను రాచకొండ కమిషనరేట్ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సరిహద్దులోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్మండలం తుఫ్రాన్పేట గ్రామంలో జరిగిన ఈ భూబాగోతానికి సంబంధించిన బాధితులు, నిందితులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై, రాజధానికి సమీపాన తుఫ్రాన్పేట గ్రామం ఉంది. రెండున్నర దశాబ్దాలుగా రియల్ఎస్టేట్వ్యాపారం ఇక్కడ జోరుగా సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రదేశ్కు చెందిన పలువురు వ్యాపారులు ఇక్కడ భూములను కొనుగోలు చేసి ప్లాట్లను విక్రయించారు. తెలంగాణ వారికంటే హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రులే ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేశారు. అప్పట్లో రిజస్ట్రేషన్డాక్యుమెంట్లలో ఫొటోలు ఉండేవి కావు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫొటోలు లేని డాక్యుమెంట్ల సీసీ కాపీలను తీసుకుని ముఠా సభ్యులు అందులోని కొనుగోలుదారుల పేరున ఇతరుల ఫొటో పెట్టి ఆధార్ కార్డును సృష్టిస్తున్నారు. ఆ ఆధార్ కార్డు ఆధారంగా ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఇలా తుఫ్రాన్పేట గ్రామంలో పలువురు ప్రజాప్రతినిధులు, లోకల్ లీడర్లు ప్లాట్లను అమ్మేసి కోట్లకు పడగలెత్తారు.
బయట పడిందిలా..
హైదరాబాద్కు చెందిన టి.కిరణ్కుమార్గ్రీన్ సిటీ వెంచర్లో 266 గజాలు గల 1837 నంబరు ప్లాట్ను 2016లో కొనుగోలు చేశాడు. ఇతని పేరుతో ఖైతాపురం గ్రామానికి చెందిన వెల్మ రామలింగేశ్వరరెడ్డి ఫొటోను ఉపయోగించి నకిలీ పాన్కార్డును సృష్టించారు. దీని ఆధారంగా తుఫ్రాన్పేటకు చెందిన ఏనుగు మాధవరెడ్డి పేరున 2019లో ఈ ప్లాట్ను రిజిస్ట్రేషన్ చేయించారు. తన పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించి ప్లాటును ఇతరులకు అమ్మేశారని గుర్తించిన కిరణ్కుమార్ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. నకిలీ కార్డుతో ప్లాట్ రిజిస్టర్చేసిన ఖైతాపురం గ్రామానికి రామలింగేశ్వర్రెడ్డి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తుఫ్రాన్పేట గ్రామానికి చెందిన ఏనుగు మాధవరెడ్డి, అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఇదే తుఫ్రాన్పేట గ్రామానికి చెందిన మరో నాయకుడిని, చౌటుప్పల్సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన డాక్యుమెంట్ రైటర్ ఆకుల శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆంధ్రావాళ్ల ప్లాట్లే టార్గెట్
తుఫ్రాన్పేట, మల్కాపురం గ్రామాలకు చెందిన పలువురు లోకల్ లీడర్లు ఇలాగే ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్ల ప్లాట్లను ఎంపిక చేసుకొని నకిలీ ఆధార్, పాన్, ఓటర్ కార్డులను సృష్టిస్తున్నారు. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లకే ఈ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలా ఇప్పటికే వందలాది ప్లాట్లను విక్రయించినట్టు తెలుస్తోంది. ఎస్వోటీ పోలీసులు విచారణలో మాధవరెడ్డి నుంచి దాదాపు 50 ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అదే విధంగా తుఫ్రాన్పేటకు చెందిన పలువురు పెద్ద మొత్తంలో ప్లాట్లను అమ్మేసినట్టు తెలుస్తోంది. మరికొందరు ఖాళీగా ఉన్న ఫ్లాట్లను కబ్జా చేసి లే అవుట్లు మార్చి అమ్మేస్తున్నారు. తుఫ్రాన్పేటలోని 27వెంచర్లలో సామాజికి అవసరాల కోసం వదిలేసిన 10శాతం భూమిని కూడా ప్లాట్లుగా చేసి విక్రయించారు. లేఅవుట్లలోని రోడ్లను సైతం అమ్మేశారు. ఇలా నకిలీ ఆధార్ కార్డులతో ప్లాట్లు, లే అవుట్లలోని పార్క్ స్థలాలను అమ్మేసి రూ. కోట్లు కొల్లగొట్టారు.
విజయవాడ నుంచి పిలిపించి…
తుఫ్రాన్పేట గ్రామానికి చెందిన లోకల్ లీడర్కు విజయవాడకు చెందిన యువతితో వివాహమైంది. ఆ పెళ్లి ఫొటోలను అక్కడి నుంచి ఓ ఫొటోగ్రాఫర్తీశాడు. ఇతని ద్వారా అక్కడి వారిని ఇక్కడికి రప్పించి, వారి పేరు మీద నకిలీ ఆధార్కార్డులు, పాన్కార్డులు, ఓటర్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ లు సృష్టిస్తున్నారు. వారితో ప్లాట్లను అమ్మేస్తున్నారు. ఇలా ఒక్కరిని ఒక్క ప్లాట్కే వినియోగిస్తున్నారు. ఇంకో ప్లాట్ను గుర్తించాక ఇంకొకరిని రప్పిస్తున్నారు. ఆడవాళ్లను సైతం రప్పించి ఆధార్ కార్డులు సృష్టించి ప్లాట్లను అమ్మేస్తున్నారు. వారికి రానుపోను ఖర్చులను భరించడంతోపాటు ఎంతోకొంత ముట్టజెప్పుతున్నారు. ఇదే క్రమంలో గుంటూరుకు చెందిన షేక్ఖాదర్ పాషాను ఇక్కడికి రప్పించి కాకాని ప్రసాద్గా ఆధార్ కార్డు సృష్టించి ఓ ప్లాట్ను అమ్మేశారు.
ఒకటే నంబరు అటూ ఇటు మార్చి..
పక్కనున్న మూడు ఆధార్ నంబర్లు గమనించారా… అన్నింటిలోనూ ఒకే నంబర్లు ఉన్నాయి. కాకపోతే కాస్త అటు ఇటుగా మార్చేశారు. ఆ నకిలీ కార్డులను చూపించి ఇతరుల ప్లాట్లు ఆధార్కార్డులో ఉన్నవారివేనంటూ అమ్మేస్తున్నారు.