కేసీఆర్​ ఎలాంటి నిరాహార దీక్ష చేయలే : గజ్జెల కాంతం

కేసీఆర్​ ఎలాంటి నిరాహార దీక్ష చేయలే : గజ్జెల కాంతం
  • ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శ
  • దీక్ష పేరుతో నిమ్స్​లో డ్రామా  ఆడిండు 
  • ఆయన కూతురు కవిత పక్కనే కూర్చుని జ్యూస్ ఇచ్చేదని ఎద్దేవా

ఖైరతాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలు ప్రాణ త్యాగం చేస్తే.. కేసీఆర్ ​కుటుంబం దాని ఫలితాన్ని అనుభవించిందని ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్, సీనియర్​ కాంగ్రెస్​నేత గజ్జెల కాంతం చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా ప్రాణాత్యాగం చేశారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఉద్యమకారుల రౌండ్​ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన ఫొటోకు నివాళులర్పించారు. 

అనంతరం గజ్జెల కాంతం మాట్లాడుతూ.. కేసీఆర్ నిరాహార దీక్ష పేరుతో అప్పట్లో నిమ్స్​లో డ్రామా ఆడారని విమర్శించారు. ఆయన కూతురు కవిత పక్కనే కూర్చుని జ్యూస్​ఇచ్చేదని.. ఆ తతంగం పూర్తయ్యేవరకు లోపలకు ఎవరినీ వెళ్లనిచ్చేవారు కాదని ఆరోపించారు. ప్రజల త్యాగాల ఫలితంతోనే తెలంగాణ సిద్ధించిందన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లు కేసీఆర్​కుటుంబం రూ.3లక్షల కోట్లు దోచుకుందని ఆరోపించారు. ఆయన కూతురు, కొడుకు, అల్లుడు వేలాది ఎకరాలు కూడగొట్టుకున్నారని మండిపడ్డారు.

 ప్రాణ త్యాగం చేసేందుకు శ్రీకాంతాచారికి పెట్రోలు, అగ్గిపెట్టె దొరికితే.. హరీశ్​రావుకు పెట్రోలు మాత్రమే దొరికిందని ఎద్దేవా చేశారు. ఎస్సీ కార్పొరేషన్​మాజీ చైర్మన్​పిడమర్తి రవి మాట్లాడుతూ.. కేవలం కల్వకుంట్ల కుటుంబమే తెలంగాణ తెచ్చిందన్నట్టు సంబురాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యార్థులు, ఉద్యోగులతోనే తెలంగాణ వచ్చిందన్నారు.

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఉద్యమకారులకు ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​ రెడ్డిని కోరారు. సమావేశంలో జైగౌడ సంఘం అధ్యక్షుడు వట్టికూర రామారావుగౌడ్​, రజక సంఘం అధ్యక్షుడు ముప్పు భిక్షపతి,  అసిస్టెంట్​ ప్రొఫెసర్​ గుడిపల్లి రవి, ఓయూ జేఏసీ నాయకులు రహీం, బద్రి, దర్శనం జాన్, బోరెల్లి సురేశ్,  తదిరులు పాల్గొని మాట్లాడారు.

శ్రీకాంతాచారి ఫొటోకు నివాళి 

ముషీరాబాద్: ఆత్మ బలిదానంతో శ్రీకాంతాచారి తెలంగాణలో ఉద్యమ జ్వాలను రగిలించారని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్​చారి చెప్పారు. మంగళవారం సైనిక్​పురిలోని జేఏసీ ఆఫీసులో శ్రీకాంతాచారి వర్ధంతి నిర్వహించారు. గణేశ్​చారి పాల్గొని శ్రీకాంతాచారి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాంతాచారి మంటల్లో కాలిపోతుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు గుండెలు పగిలాయన్నారు. అతని త్యాగం మరువలేనిదన్నారు. శ్రీకాంతాచారి తల్లిదండ్రుల్లో ఒక్కరికైనా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని కోరారు.