
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కులగణనకు సంబంధించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ అన్నారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావాలని బలంగా కోరుకున్న వారిలో మల్లన్న ఒకరని, పైగా రేవంత్కి ఆయన అత్యంత సన్నిహితుడని చెప్పారు.
మీడియా సమావేశంలో మల్లన్న లేవనెత్తిన పలు సందేహాలకు రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ కూడా జవాబు చెప్పాల్సి ఉందన్నారు. అలాగే, పార్టీ లైన్ దాటిన ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో బీసీలకు ఒక న్యాయం, ఇంకో వర్గానికి మరో న్యాయం జరుగుతున్నదని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు.