మార్కెట్​లో హుషారు .. 187 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

మార్కెట్​లో హుషారు .. 187 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

 

  • సెన్సెక్స్ 611 పాయింట్లు అప్​
     
    ముంబై: యూఎస్​ ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే ఆశలకుతోడు మెటల్, ఐటీ,  కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్‌‌‌‌లలో భారీ కొనుగోళ్లు జరగడంతో స్టాక్ మార్కెట్ బెంచ్‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీ సోమవారం దాదాపు 1 శాతం పెరిగాయి. విదేశీ నిధుల ప్రవాహం బాగుండటం, ఫ్రంట్‌‌‌‌లైన్ స్టాక్స్‌‌‌‌ హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్,  రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌‌‌లో కొనుగోళ్లు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌‌‌ను మరింత పెంచాయని ట్రేడర్లు తెలిపారు. సెన్సెక్స్  వరుసగా ఐదవ రోజు పెరిగింది. ఇది 611.90 పాయింట్లు ఎగిసి 81,698.11 వద్ద స్థిరపడింది. 

ఇంట్రాడేలో 738.06 పాయింట్లు పెరిగి 81,824.27 వద్దకు చేరుకుంది.  బీఎస్​ఈలో మొత్తం 2,189 స్టాక్‌‌‌‌లు పురోగమించగా, 1,860 తగ్గాయి.  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ నిఫ్టీ 187.45 పాయింట్లు పెరిగి 25,010.60కి చేరుకుంది. వరుసగా ఎనిమిదో సెషన్‌‌‌‌లో లాభాలను నమోదు చేసింది.  30 సెన్సెక్స్ కంపెనీల్లో హెచ్‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్, ఎన్‌‌‌‌టీపీసీ, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, టెక్ మహీంద్రా, జెఎస్‌‌‌‌డబ్ల్యూ స్టీల్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టూబ్రో.  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అత్యధికంగా లాభపడ్డాయి. అయితే కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ,  హిందుస్థాన్ యూనిలీవర్ వెనకబడి ఉన్నాయి. బీఎస్​ఈ మిడ్‌‌‌‌క్యాప్ గేజ్ 0.66 శాతం,  స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగింది.

నిపుణుల మాట ఇది

ఈసారి సెప్టెంబరులో వడ్డీరేట్లను తగ్గిస్తామనే సంకేతాలను యూఎస్​ఫెడ్​ పంపించిందని, అంతేగాక యూఎస్​ ట్రెజరీ దిగుబడులు  డాలర్ ఇండెక్స్ క్షీణతను ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అందుకే ప్రపంచ మార్కెట్లలో ర్యాలీకి దారితీసిందని, భారతీయ మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయని  జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.    

ఇండెక్స్‌‌‌‌లలో మెటల్ 2.03 శాతం, రియల్టీ 1.69 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.43 శాతం, ఐటీ 1.37 శాతం, టెక్ 1.11 శాతం, కమోడిటీలు 0.91 శాతం పెరిగాయి.  టెలికమ్యూనికేషన్,  సేవలు వెనుకబడి ఉన్నాయి.  ఆసియా మార్కెట్లలో, షాంఘై,  హాంకాంగ్ సానుకూలంగా,  సియోల్,  టోక్యో నష్టాల్లో ముగిశాయి.  ఐరోపా మార్కెట్లు చాలా వరకు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు గణనీయమైన లాభాలతో ముగిశాయి.   విదేశీ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) శుక్రవారం రూ.1,944.48 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.

పేటీఎం షేర్లు డౌన్​

పేటీఎం ఐపీఓ సమయంలో దాని ఫౌండర్​ విజయ్ శేఖర్ శర్మ  బోర్డు సభ్యులకు వాస్తవాలను తెలియజేయనందుకు సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్న వార్తల కారణంగా పేటీఎం పేరెంట్​ కంపెనీ వన్​97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ షేర్లు   4 శాతానికి పైగా పడిపోయాయి.  బీఎస్‌‌‌‌ఈలో ఈ షేరు 4.41 శాతం తగ్గి రూ.530.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 8.88 శాతం పతనమై రూ.505.25కి చేరుకుంది.  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలో కంపెనీ షేర్లు 4.47 శాతం క్షీణించి రూ.530కి పడిపోయాయి. ఇంట్రా-డేలో 8.88 శాతం పతనమై రూ.505లకు చేరుకుంది.  కంపెనీ మార్కెట్ విలువ రూ.1,534.23 కోట్లు తగ్గింది.