
- 207 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ముంబై: పహల్గామ్ దాడి కారణంగా ఇండో–-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడం, యాక్సిస్ బ్యాంక్లో అమ్మకాలతో వరుసగా రెండో రోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీలు పడ్డాయి. సెన్సెక్స్ 588.90 పాయింట్లు పడిపోయి 79,212.53 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1,195.62 పాయింట్లు శాతం కుంగి 78,605.81కి చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 207.35 పాయింట్లు తగ్గి 24,039.35కి చేరుకుంది. ఐటీ ఇండెక్స్ మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ప్రాఫిట్బుకింగ్వల్ల మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 2 శాతానికి పైగా పడిపోయాయి. సెన్సెక్స్ షేర్లలో, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, ఎటర్నల్, బజాజ్ ఫిన్సర్వ్, పవర్ గ్రిడ్, మారుతి, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఎన్టీపీసీ నష్టపోయాయి. మార్చి క్వార్టర్ రిజల్ట్స్ మెప్పించకపోవడంతో యాక్సిస్ బ్యాంక్ షేరు మూడు శాతానికి పైగా కుంగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ గేజ్ 2.56 శాతం, మిడ్క్యాప్ 2.44 శాతం తగ్గింది.
నష్టాల్లో మెజారిటీ సూచీలు
బీఎస్ఈ సెక్టోరల్ సూచీలలో సేవలు 3.11 శాతం, యుటిలిటీస్ 2.96 శాతం, రియాల్టీ 2.87 శాతం, విద్యుత్ 2.77 శాతం, కన్జూమర్ డిస్క్రెషనరీ 2.28 శాతం, ఇండస్ట్రియల్స్ 2.19 శాతం, క్యాపిటల్ గూడ్స్2.06 శాతం పడిపోయాయి. ఐటీ, బీఎస్ఈ ఫోకస్డ్ఐటీ లాభాలతో ముగిశాయి. బీఎస్ఈలో 3,246 స్టాక్లు క్షీణించగా, 719 లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్, టోక్యో నిక్కీ 225, హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ లాభాల్లో స్థిరపడ్డాయి. షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ కొద్దిగా తగ్గింది. యూరప్లో మార్కెట్లు లాభాలతో ముగిశాయి. యూఎస్ మార్కెట్లు గురువారం బాగా పెరిగాయి. నాస్డాక్ కాంపోజిట్ 2.74 శాతం, ఎస్ అండ్ పీ 500 2.03 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.23 శాతం పెరిగాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.8,250.53 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ 0.50 శాతం తగ్గి బ్యారెల్కు 66.24 డాలర్లకు చేరుకుంది.