సెన్సెక్స్​ 610 పాయింట్లు జంప్.. 207 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

సెన్సెక్స్​ 610 పాయింట్లు జంప్.. 207 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

న్యూఢిల్లీ: స్టాక్​మార్కెట్లు వరుసగా రెండో రోజైన గురువారం కూడా లాభపడ్డాయి. క్రూడాయిల్​ధరలు తగ్గుతుండడం, టారిఫ్​ల విధింపుపై ట్రంప్​వెనక్కి తగ్గుతున్నట్టు సంకేతాలు రావడంతో సెన్సెక్స్​610 పాయింట్ల లాభంతో 74,340.09 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 660.57 పాయింట్లు దూసుకెళ్లింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 207.40 పాయింట్ల లాభంతో 22,544.70 వద్ద ముగిసింది.  

 సెన్సెక్స్​లో ఆసియన్ పెయింట్స్, ఎన్‌‌‌‌టీపీసీ, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, హెచ్​యూఎల్​, సన్ ఫార్మా, ఏపీ సెజ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్​, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వెనకబడి ఉన్నాయి. బీఎస్ఈ స్మాల్​క్యాప్​1.63 శాతం, మిడ్​క్యాప్​ఇండెక్స్​0.65 శాతం పెరిగాయి. 

సెక్టోరల్​ ఇండెక్స్​లలో టెలికం, రియల్టీ మాత్రమే నష్టపోయాయి. బీఎస్​ఈ లిస్టెడ్​ కంపెనీల మార్కెట్ ​క్యాప్​4,53,808.84 కోట్లు పెరిగింది. ఆసియా మార్కెట్లలో టోక్యో, షాంఘై, హాంగ్​కాంగ్, సియోల్​ లాభపడ్డాయి. యూరప్​మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్​క్రూడ్ ధర 0.52 శాతం పెరిగి 69.66 డాలర్లకు చేరింది. ఎఫ్​ఐఐలు బుధవారం రూ.2,895.04 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.