
సంగారెడ్డి: డా.బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చిన చట్టం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామంలో 12 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం (మార్చి 27) ఎమ్మెల్యే వివేక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమలాపూర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ గ్రామం మొత్తం పండగ వాతావరణాన్ని తలపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
తన తండ్రి కాకా వెంకటస్వామి నిత్యం ప్రజల గురించి ఆలోచించారని.. అంబేద్కర్ అనుచరుడిగా హైదరాబాద్లో అంబేద్కర్ కాలేజ్ స్థాపించారని తెలిపారు. ఎంతో మంది పేదలకు కాకా ఇండ్ల జాగాలు ఇచ్చారని గుర్త చేశారు. సమాజంలో పైకి ఎదిగిన వారు.. మన చుట్టు ఉన్న వారికి సహాయం చేయాలని.. అంబేద్కర్ దారిలో నడవాలని సూచించారు. అంబేద్కర్ కేవలం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వలేదని.. దాదాపు అన్నవర్గాల్లోని పేదలకు, స్త్రీలకు ఉపయోగపడే బిల్లులు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు.
Also Read : బీఆర్ఎస్కు CM రేవంత్ సవాల్
అంబేద్కర్ ఆలోచనలతోనే రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్థాపించారని అన్నారు. దళితులంత నిరంతరం కష్టపడటం నేర్చుకోవాలని.. బాగా చదవాలని సూచించారు. పిల్లలకు క్రమశిక్షణ, మంచి విద్య అందించాలని.. మద్యం సేవించడం బంద్ చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ పిలుపునిచ్చారు.