సిటీలో మళ్లీ పేలిన తూటా..గచ్చిబౌలి ప్రిజం పబ్​లో కాల్పుల కలకలం

సిటీలో మళ్లీ పేలిన తూటా..గచ్చిబౌలి ప్రిజం పబ్​లో కాల్పుల కలకలం
  •     దొంగను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపైనే ఘాతుకం
  •     కానిస్టేబుల్ పాదంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్ 
  •     సాహసోపేతంగా నిందితుడి ఆటకట్టించిన పోలీసులు, బౌన్సర్లు 
  •     నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్​గా గుర్తింపు

గచ్చిబౌలి, వెలుగు : హైదరాబాద్​లో మళ్లీ తూటా పేలింది. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్​లో శనివారం రాత్రి కాల్పుల ఘటన  కలకలం సృష్టించింది. తనను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ఓ దొంగ మూడు రౌండ్ల కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒక బులెట్ సీసీఎస్ కానిస్టేబుల్ పాదంలోకి చొచ్చుకెళ్లింది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సాహసోపేతంగా పోరాడి నిందితుడిని పబ్​ బౌన్సర్లతో కలిసి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలు దొంగతనాల్లో తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ (30) కోసం మాదాపూర్ సీసీఎస్ పోలీసులు వెతుకుతున్నారు. ప్రభాకర్ రెగ్యులర్​గా పబ్​లకు వస్తున్నట్లు సమాచారం రావడంతో శనివారం మాదాపూర్ జోన్ పరిధిలోని అన్ని పబ్ ల వద్ద నిఘా పెట్టారు. 

రాత్రి ప్రభాకర్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్​కు వచ్చినట్లు తెలియడంతో మాదాపూర్ సీసీఎస్​కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రాంరెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడి వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో పబ్ నుంచి బయటకు వస్తున్న ప్రభాకర్​ను కానిసేబుళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు తన జాకెట్​లో ఉన్న కంట్రీమేడ్ పిస్టల్​తో పైకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల నుంచి తప్పించుకున్న కానిస్టేబుళ్లు.. పబ్ బౌన్సర్లతో కలిసి వెంటనే ప్రభాకర్​ను అదుపులోకి తీసుకొని గన్​ను స్వాధీనం చేసుకున్నారు. 

వెంటనే తన వద్ద ఉన్న మరో పిస్టల్​తో ప్రభాకర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్ వెంకట్రాంరెడ్డి పైకి ఒక రౌండ్ కాల్పులు జరపగా, దీంతో ఒక బుల్లెట్ అతడిని ఎడమ కాలు పాదంలో నుంచి బయటకు దూసుకెళ్లింది. వెంటనే మిగిలిన పోలీసులు ప్రభాకర్ వద్ద ఉన్న పిస్టల్​ను స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని రహాస్య ప్రాంతానికి తరలించారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ వెంకట్రాంరెడ్డితో పాటు పబ్ బౌన్సర్లను నానక్​రాంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, మాదాపూర్ జోన్ డీసీపీ వినీత్​తో కలిసి పరామర్శించారు. వెంకట్రాంరెడ్డి ఎడమ కాలు పాదంలోని ఎముకకు గాయం అయ్యిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డీసీపీ వినీత్ తెలిపారు. 

2 పిస్టళ్లు.. 23 రౌండ్ల బుల్లెట్లు 

ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన ప్రభాకర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో 80 కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు. వైజాగ్ జైలు నుంచి తప్పించుకున్న ప్రభాకర్ 2022 ఫిబ్రవరి నుంచి పోలీసులకు చిక్కట్లేదు. పబ్​కు వచ్చేటప్పుడు ప్రభాకర్ రెండు గన్​లు, 23 రౌండ్ల బుల్లెట్లు పట్టుకువచ్చినట్లు డీసీపీ తెలిపారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

 ఇంజినీరింగ్ కాలేజీలే టార్గెట్

గత రెండేండ్లుగా బత్తుల ప్రభాకర్‌‌ను ట్రాక్ చేస్తున్నామని సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. నిందితుడు ఇంజినీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నట్లు వివరించారు. అడ్మిషన్లు, పరీక్షలు, హాస్టల్ ఫీజుల రూపంలో వచ్చిన డబ్బును కాలేజీలో పెడతారని వాటిని సులభంగా దొంగతనం చేయవచ్చని డిసైడ్ అయ్యి టార్గెట్ చేసుకొని దొంగతనం చేస్తున్నాడు. 2022లో ప్రభాకర్​ను అనకాపల్లి కోర్టు నుంచి వైజాగ్ సెంట్రల్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పరారీలో ఉంటూ సైబరాబాద్, హైదరాబాద్ లో దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు..

 ఇటీవల మొయినాబాద్‌‌లో జరిగిన ఒక దొంగతనం కేసులో పోలీసులకు ప్రభాకర్ వేలిముద్రలు దొరికాయి. దీంతో పోలీసులు ప్రభాకర్ కదలికలపై నిఘా పెట్టారు. అయితే, ప్రభాకర్ తనను గుర్తుపట్టకుండా ముసుగులు ధరిస్తూ, మకాం మారుస్తూ వస్తున్నట్లు చెప్పారు. ఈక్రమంలో శనివారం అతడిపై నిఘా పెట్టి పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.