
కల్వకుర్తి, వెలుగు: దైవ దర్శనం కోసం వచ్చిన ఓ మహిళపై ఏడుగురు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా ఊరుకొండపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన ఓ వివాహిత వరుసకు బావ అయిన ఆంజనేయులుతో కలిసి శనివారం రాత్రి ఊరుకొండ పేట ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది.
రాత్రి ఆలయంలో నిద్ర చేసిన అనంతరం సదరు మహిళ ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమి కోసం పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని గమనించిన ఆలయానికి చెందిన ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి గ్రామానికి చెందిన యువకులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఏడుగురు యువకులు వచ్చి మహిళను పక్కనే ఉన్న గుట్టల్లోకి లాక్కెళ్లారు.
మహిళ ఎంతకూ తిరిగి రాకపోవడంతో అటువైపు వెళ్లిన ఆమె బావ ఆంజనేయులును చెట్టుకు కట్టేసి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు మహిళపై లైంగికదాడి చేశారు. అనంతరం మహిళ మెడలోని పుస్తెలతాడు, చెవి రింగులు లాక్కున్నారు. యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత సదరు మహిళ ఆంజనేయులు కట్లు విడిపించి స్వగ్రామం వెళ్లిపోయింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు భూత్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఊరుకొండ పేట పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు.
పోలీసుల అదుపులో యువకులు
లైంగిక దాడి సమాచారం అందుకున్న ఊరుకొండ పేట పోలీసులు ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న నాగర్కర్నూల్ ఎస్పీ రఘునాథ్ వైభవ్ గైక్వాడ్, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, కల్వకుర్తి సీఐతో కలిసి ఊరుకొండ పోలీస్స్టేషన్కు చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఏడుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని తెలిపారు. దాడిలో ఇంకా ఎవరైనా పాల్గొన్నారా అనే విషయంపై ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి కోరారు.