
- ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ప్రాణహిత– చేవెళ్ల కింద చేపట్టిన ప్యాకేజీ 22 పనులు చేపట్టాలని, భూ సేకరణకు ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రాజెక్టులపై హైదరాబాద్లోని జలసౌధలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రివ్యూ నిర్వహించగా షబ్బీర్ అలీ మీడియాకు ప్రకటన రిలీజ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్యాకేజీ 21, 22 పనులు పూర్తి చేయడంతోపాటు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలన్నారు.
ప్యాకేజీ 20లో భాగంగా నిజాంసాగర్ ఏకీకృత కెనాల్లో వాటర్ లీకేజీ అరికట్టేందుకు కంక్రీట్ గోడ నిర్మించాలని తీర్మానించినట్లు తెలిపారు. ప్రాజెక్ట్కు చేరువలోని 12 ఎకరాల ల్యాండ్లో ఎకో టూరిజం ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. మునిపల్లి లిఫ్ట్ స్కీమ్ బకాయిలు రిలీజ్ చేయడంతో పాటు ఆర్మూర్ సెగ్మెంట్లోని నాలుగు మైనర్ లిఫ్ట్లను పునరుద్ధరిస్తామన్నారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయడమేకాకుండా చౌట్పల్లి లిఫ్ట్ స్కీం పైప్ లైన్ లీకేజీలు ఆపడానికి రిపేర్లు చేయించాలని నిర్ణయించామన్నారు.
నాగమడుగు రిజర్వాయర్తో భూములు ముంపునకు గురికాకుండా కాపాడతామని, వరద నీటితో దెబ్బతిన్న సింగీతం ప్రాజెక్టు కెనాల్స్ బాగు చేయించి, కౌలాస్నాలా ఆధునీకరణ సాధ్యసాధ్యాలు ఇంజినీర్లతో స్టడీ చేయించి నివేదికలు తెప్పించుకుంటామన్నారు. రివ్యూలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, పీసీసీ ప్రెసిడెంగ్మహేశ్కుమార్ గౌడ్, రూరల్ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
పాత డిజైన్తో మంచిప్ప రిజర్వాయర్ నిర్మించాలి..
ప్రాణహిత 21 ప్యాకేజీ కింద మంచిప్ప వద్ద రైతులకు నష్టం కలుగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన పాత డిజైన్లో నిర్మాణ పనులు చేపట్టాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంత్రి ఉత్తమ్ను కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తయారు చేసిన రీడిజైన్తో నష్టం కలుగుతుందని దానిని పక్కనపెట్టాలన్నారు. ప్యాకేజీ కింద 1.82 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా గతంలో కాంగ్రెస్ సర్కారు రూపొందించిన ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్లాలని కోరారు.