
మహదేవపూర్, వెలుగు : సరస్వతీ పుష్కరాల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద జరగనున్న సరస్వతీ నది పుష్కరాల పనులను బుధవారం సంగీత, నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాలతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా వీఐపీ ఘాట్, సరస్వతీ మాత విగ్రహ ఏర్పాటు, 100 గదుల సత్రం పనులను పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. మే 15 నుంచి పుష్కరాలు జరగనున్నందున పనులను క్యాజువల్గా తీసుకోవద్దన్నారు. పనులు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. శాఖల వారీ చేపట్టనున్న పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పరిశీలించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పాల్గొన్నారు.