కాన్పూర్: బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లకు గురువారం వీడ్కోలు పలికాడు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పాడు. అయితే ఫ్రాంచైజీ క్రికెట్కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇక టెస్ట్ కెరీర్పై కూడా షకీబ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్లో ఆడే అవకాశం రాకపోతే కాన్పూర్ (ఇండియాతో రెండో టెస్ట్) మ్యాచే తన కెరీర్లో చివరిది అవుతుందని వెల్లడించాడు. ‘టీ20 వరల్డ్ కప్లోనే నేను చివరి టీ20 మ్యాచ్ ఆడేశా. ఈ ఫార్మాట్ గురించి సెలెక్టర్లతో చర్చించా. 2026 వరల్డ్ కప్కు చాలా ఎక్కువ సమయం ఉంది. కాబట్టి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని భావిస్తున్నా. నా ప్లేస్లో మరింతమంది గొప్ప ప్లేయర్లు జట్టులోకి వచ్చి మెరుగ్గా ఆడతారని ఆశిస్తున్నా. ఇక సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్కు నన్ను ఎంపిక చేస్తారో లేదో తెలియదు.
కేవలం అల్లాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇండియాతో రెండో టెస్టే ఆఖరిది కావొచ్చు’ అని షకీబ్ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీతో వన్డేలకు గుడ్బై చెబుతానని స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ తరఫున 129 టీ20లు ఆడిన షకీబ్ 23.19 యావరేజ్తో 2551 రన్స్ చేశాడు. ఇందులో13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. షార్ట్ ఫార్మాట్లో149 వికెట్లు తీశాడు. ఇక 70 టెస్ట్ల్లో 4600 రన్స్, 242 వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్లో మిర్పూర్కు చెందిన షకీబ్.. షేక్ హసీనా గవర్నమెంట్లో ఎంపీగా కూడా గెలిచాడు. అయితే ఇటీవల జరిగిన అల్లర్లలో అతనిపై ఓ హత్యానేరం కేసు నమోదైంది. దీంతో భవిష్యత్లో క్రికెట్ ఆడే అవకాశాలపై సందిగ్ధత నెలకొనడంతో రిటైర్మెంట్కు మొగ్గు చూపాడు. ‘మిర్పూర్లో చివరి టెస్ట్ ఆడే చాన్స్ ఇవ్వాలని బంగ్లా బోర్డును కోరా. వాళ్లు అంగీకరించారు. అన్నీ సవ్యంగా సాగేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అందుకే బంగ్లాదేశ్ వెళ్లాలనుకుంటున్నా. ఒకవేళ ఇది జరగకపోతే కాన్పూర్ టెస్ట్ నా కెరీర్లో చివరిది అవుతుంది’ అని షకీబ్ వ్యాఖ్యానించాడు.