శాలివాహన పవర్ ప్లాంట్ ఫర్ సేల్!..భూములను అమ్మకానికి పెట్టిన మేనేజ్ మెంట్

శాలివాహన పవర్ ప్లాంట్ ఫర్ సేల్!..భూములను అమ్మకానికి పెట్టిన మేనేజ్ మెంట్
  • పీపీఏ గడువు పూర్తితో రెండేండ్ల కింద ప్లాంట్ క్లోజ్​ 
  • కార్మికులకు సెంటిల్ మెంట్ చేయకుండా పెండింగ్
  • రోడ్డున పడిన ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లే
  • సెటిల్​మెంట్​కోసం మరోసారి కార్మికుల పోరుబాట

మంచిర్యాల, వెలుగు : శాలివాహన బయోమాస్, గ్రీన్​ఎనర్జీ పవర్​ప్లాంట్​ను రెండేండ్ల కింద మూసివేసిన మేనేజ్​మెంట్​ఇటీవల ప్లాంట్​భూములను అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. దీంతో పెండింగ్​శాలరీస్​, ఏరియర్స్​, బోనస్​తో పాటు సెటిల్​మెంట్​డబ్బుల కోసం రెండ్లేండ్లుగా పోరాడుతున్న కార్మికులు మరోసారి ఆందోళన బాట పట్టారు. వారం రోజులుగా పవర్​ప్లాంట్​ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 

ఈ నెలాఖరులోగా మేనేజ్​మెంట్​మొండిపట్టు వీడి సెటిల్​మెంట్​కు ఒప్పుకోకపోతే అమ్మకానికి పెట్టిన ప్లాంట్​భూముల్లో గుడిసెలు వేస్తామని కార్మిక నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, లేబర్​డిపార్ట్​మెంట్​స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. 

రెండేండ్ల కింద ప్లాంట్​ క్లోజ్ 

2002లో పాత మంచిర్యాలలో పవర్​ప్లాంట్​ను 6 మెగావాట్ల కెపాసిటీతో పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్క కొమురయ్య ఏర్పాటు చేశారు. సింగరేణి బొగ్గు, రైస్​మిల్లుల నుంచి వచ్చే ఊక, సామిల్స్​నుంచి వచ్చే కర్ర పొట్టు ముడి పదార్థాలుగా కరెంట్ ఉత్పత్తి చేపట్టారు. ఇక్కడ ఉత్పత్తయ్యే కరెంట్​ను ప్రభుత్వానికి సప్లై చేసేందు కు 20 ఏండ్ల గడువుతో పవర్​పర్చేజ్​అగ్రిమెంట్(పీపీఏ) కుదుర్చుకున్నారు. 2022 డిసెంబర్6తో పీపీఏ గడు వు ముగియడంతో కరెంట్​ఉత్పత్తి నిలిపివేశారు. 

అప్పట్లో కార్మికులు ప్రభుత్వం స్పందించి పీపీఏను పొడిగించాలని, ప్లాంట్​ను పునరుద్ధరించాలని ఆందోళనలు చేపట్టినా ఫలితం లేదు.  వివిధ కారణాలతో పవర్​ ప్లాంట్​ను క్లోజ్​చేయాలనే ఆలోచనతో మేనేజ్​మెంట్​ పీపీఏ కోసం ప్రయత్నించకుండానే ఇదే అదునుగా తీసుకుని లే ఆఫ్​ప్రకటించింది. 

రోడ్డున పడ్డ కార్మికులు.. 

 పవర్​ ప్లాంట్​ప్రారంభంలో 300 మందికిపైగా కార్మికులు ఉండగా, క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. క్లోజ్​ చేసేనాటికి 100 మంది పర్మినెంట్, మరో 100 మంది కాంట్రాక్ట్​ వర్కర్లు ఉన్నారు. అరకొర జీతాలు చెల్లించగా.. ఎప్పటికైనా పెరగకపోతాయనే ఆశతో ఉన్న కార్మికులపై ప్లాంట్​మూసివేత పిడుగు పడ్డంత పనైంది. మూడేండ్ల పెండింగ్​ఏరియర్స్​, బోనస్​తో పాటు జీతాలు, పీఎఫ్​, గ్రాట్యుటీ డబ్బులు చెల్లించి సెటిల్​మెంట్​చేయాలని కార్మికులు రెండేండ్ల నుంచి పోరాడుతున్నా మేనేజ్​మెంట్​పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 

Also Read :- స్పౌజ్​, మ్యూచువల్ ట్రాన్స్ ఫర్లలో కాసుల దందా!

ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రావాల్సి ఉంది. అయితే.. రూ.లక్ష నుంచి రూ.2లక్షలు మాత్రమే చెల్లిస్తామనడంతో వ్యతిరేకించారు. అప్పటినుంచి దశల వారీగా ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వం, మేనేజ్​మెంట్ తమ గోడు వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం ప్లాంట్​నే నమ్ముకొని బతికామని, 50 ఏండ్ల వయసులో ఇతర పనులు దొరక్క తిండికి తిప్పలు పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు.

 వేలల్లో కొనుగోలు చేసి.. 

పవర్​ప్లాంట్​ నిర్మాణానికి అప్పట్లో పాత మంచిర్యాల శివారులోని భూములను ఎకరం రూ.60 వేలకే మేనేజ్ మెంట్ కొనుగోలు చేసినట్టు కార్మికులు పేర్కొన్నారు.  11 మంది రైతుల నుంచి సుమారు 36 ఎకరాలు సేకరించగా, వారికి ప్లాంట్​లో పర్మినెంట్​జాబ్ లు ఇస్తామని హామీ ఇచ్చింది. వివిధ కారణాలతో కార్మికుల సంఖ్యలో కోత పెడుతూ 100 మందికి కుదించింది. 10 ఎకరాలను గతంలోనే అమ్ముకోగా, మిగిలిన 26 ఎకరాలను ఇటీవల అమ్మకానికి పెట్టినట్టు కార్మికులు తెలిపారు. 

మంచిర్యాల, హైదరాబాద్​కు చెందిన కొందరు రియల్టర్లు రూ.2.50 కోట్లకు ఎకరం చొప్పున కొనుగోలు చేయడానికి ముందుకురాగా.. ఇప్పటికే 6 ఎకరాలకు బయానా కట్టినట్టు చెప్తున్నారు. భూముల అమ్మకం ద్వారా రూ. కోట్లలో వెనకేసుకుంటున్న మేనేజ్​మెంట్​తమతో సెటిల్​మెంట్​కు ముందుకు రాకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండేండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవట్లేదు

పవర్​ప్లాంట్​మేనేజ్​మెంట్​మల్క కొమురయ్యకు బీజేపీ అండదండలు ఉన్నాయి. గతంలో ఆయన మల్కాజి​గిరి ఎంపీ టికెట్​కోసం ప్రయత్నించినప్పుడే ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వొద్దని బీజేపీ లీడర్లకు విన్నవించాం. తాజాగా ఆ పార్టీ తరఫున కరీంనగర్ టీచర్స్​ఎమ్మెల్సీ క్యాండిడేట్​గా పోటీ చేస్తున్నాడు. మేం న్యాయం కోసం రెండేండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడంలేదు. బీజేపీ అగ్ర నేతలు స్పందించి పవర్​ప్లాంట్​కార్మికులకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాం. 

- కుంటాల శంకర్, పపర్ ప్లాంట్ వర్కర్స్​యూనియన్​ ప్రెసిడెంట్

మా భూములు మాకు ఇప్పించాలి 

పవర్​ ప్లాంట్​ కు మేం 8 ఎకరాల భూమి ఇచ్చాం. ఎకరానికి రూ.60 వేలు చెల్లించారు. భూమి పోయినా పర్మినెంట్​జాబ్ ఉంటుందని అనుకున్నాం.  ప్లాంట్​ప్రారంభం నుంచి చేస్తున్నా. ఇప్పుడు మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డున పడేశారు. 50 ఏండ్ల వయసులో చేద్దామంటే ఏ పని దొరకట్లేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. మనస్తాపంతో ఇద్దరు, ముగ్గురు కార్మికులు చనిపోయారు.  ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన పెండింగ్​డబ్బులు ఇప్పించాలె. ఉపాధి కోల్పోయినందున మా భూములు మాకు ఇప్పించాలి. 

- నిమ్మరాజుల సత్యనారాయణ, ల్యాండ్​లూజర్, పవర్​ ప్లాంట్​ వర్కర్స్​ యూనియన్ ​జనరల్​సెక్రటరీ