బస్టాప్​లోని యువతులను ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ.. శామీర్​పేటలోని బిట్స్​ జంక్షన్​లో ఘటన

బస్టాప్​లోని యువతులను ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ.. శామీర్​పేటలోని బిట్స్​ జంక్షన్​లో ఘటన

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్​జిల్లా శామీర్​పేట పరిధిలోని బస్టాపులో వేచి ఉన్న ఇద్దరు యువతులను రెడీమిక్స్​లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తూముకుంట మున్సిపాలిటీ అంతాయిపల్లికి చెందిన కొరివి గాయత్రి(24), కొరివి భవాని(19) అక్కాచెల్లెళ్లు(అన్నదమ్ముల పిల్లలు). సోమవారం ఉదయం తిరుమలగిరిలోని ప్రైవేట్​కంపెనీలో డ్యూటీకి వెళ్లేందుకు బిట్స్ జంక్షన్ వెదురువనం బస్టాప్​కు వచ్చారు.

బస్సు కోసం అక్కడ నిలబడి ఉండగా, కీసర వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన రెడీమిక్స్ లారీ వీరిని ఢీకొట్టింది. ముందు వెళ్తున్న కారును ఓవర్​టేక్​చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయత్రి, భవాని తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని కొంపల్లిలోని శ్రీకర్ హాస్పిటల్​కు తరలించారు. విషయం తెలుసుకున్న అంతాయిపల్లి వాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

మేడ్చల్ కలెక్టరేట్​సమీపంలోని జంక్షన్​లో స్పీడ్​బ్రేకర్లు, సీసీ కెమెరాలు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. స్పీడ్​బ్రేకర్లు ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. నిత్యం కలెక్టర్​తిరిగే రూట్​లో ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. టైర్లు తగలబెడుతూ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్​ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గాయత్రి, భవాని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.