
పుష్ప సినిమా తరహాలో పనస పళ్ళ చాటున బొలోరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఏపీలోని రాజమహేంద్రవరం నుండి తెలంగాణలోని కరీంనగర్ వైపు ఓ బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శామీర్ పేట్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో ఓ బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపళ్ళ లోడుతో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా గంజాయి తరలిస్తున్న ఈ బొలేరో వాహనాన్ని అనుసరిస్తున్న మరో కారుతో పాటు 35 కిలోలకు పైగా గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. గేదెల సతీష్ , కోరాడ సాయి, బండారు శివకుమార్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివ అనే వ్యక్తి అక్కడి నుండి జారుకున్నాడు.
అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారుగా రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. పోలీసుల విచారణలో ఏ1,ఏ2గా ఉన్న సతీష్, సాయిలను ఇద్దరు పాత నేరస్థులుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండుకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు..