
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్దన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ లపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఆరూరి రమేశ్ పేరుకే ఎమ్మెల్యే కానీ కానీ ఆయన చేసేవి సివిల్ కాంట్రాక్ట్ పనులని వ్యాఖ్యానించారు. అడుగడుగునా భూ కబ్జాలు చేస్తున్నాడని.. చివరికి గుట్టలు కూడా మాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఎమ్మెల్యే అరాచకాలు భరించలేక వర్దన్నపేటలో సొంత పార్టీ కౌన్సిలర్లు ఎదురు తిరిగారని ధ్వజమెత్తారు. పర్వతగిరి మండల కేంద్రంలో పాదయాత్ర సందర్భంగా షర్మిల మాట్లాడారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత ఊరు పర్వతగిరిని కూడా పట్టించుకోవట్లేదని షర్మిల విమర్శించారు. పర్వతగిరిలో ఒక్క డిగ్రీ కాలేజీ, ఇంటర్ కాలేజీ కూడా లేదన్నారు. నిధులడిగితే ఖాళీ బీరు సీసాలు, బ్రాందీ సీసాలు అమ్ముకుని పంచాయతీ నడుపుకోవాలంటాడని వ్యాఖ్యానించారు. జిల్లాలో ఒక్క పంచాయతీ కూడా అభివృద్ధి చెందలేదు ..ఆయనో మంత్రా? అని షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వం నిధులివ్వదు కేంద్రం నుంచి వచ్చే నిధులు దక్కనివ్వదని విమర్శించారు.