
క్రోధినామ సంవత్సరం చివరి రోజుల్లో ప్రకృతి విలయతాండవం చేస్తుంది. 2025 మార్చి 29వ తేదీన శని కుంభరాశి నుంచి 10 గంటల 7 నిమిషాలకు బయలుదేరి.. 10 గంటల 32 నిమిషాలకు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక అప్పటి నుంచి షష్ట గ్రహకూటమి ఘడియలు ప్రారంభమవుతాయి. ఇప్పటికే మీనరాశిలో .. సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహాలతో శని కలవడం వలన షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పటి నుంచి 60 గంటల వరకు.. అంటే 2025, మార్చి 31వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు ఈ షష్ఠగ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత చంద్రుడు మీనరాశి నుంచి బయటకు వస్తాడు. అంటే ఈ 60 గంటలు షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది. ఈ 60 గంటల్లో ఏం జరగబోతుంది.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చనేది ఆసక్తిగా మారిందని పండితులు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా షష్టగ్రహకూటమి ప్రభావం ప్రారంభమైందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. మరో 60 గంటలు అప్రమత్తంగా ఉండాలని.. అవకాశం ఉన్నవారందరూ కూడా దైవచింతనలో గడపాలని పండితులు సూచిస్తున్నారు. ప్రయాణాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. చాలా చోట్ల అనుకోని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్నపరిణామాలను ఒకసారి పరిశీలిస్తే 2025 మార్చి 29వ తేదీ తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది. మార్చి 28వ తేదీ మయన్మార్, థాయ్లాండ్ దేశాల్లో భారీ భూకంపాలు వరసగా వచ్చాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. ఇదంతా షష్ట గ్రహకూటమి ప్రభావమేనంటున్నారు పండితులు. వారం రోజుల క్రితం సౌత్ కొరియాలో కార్చిచ్చుతో విధ్వసం ప్రారంభమైందని.. ఇది ఎటు దారితీస్తుందోనని జనాలు భయపడుతున్నారు.
ALSO READ | షష్టగ్రహకూటమి ఎఫెక్ట్: 12 రాశుల వారు చేయవలసిన పరిహారాలు ఇవే..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సమయాలను పరిశీలిస్తే.. 2019లో ఆరు గ్రహాల కలయిక వల్ల కరోనా లాంటి మహమ్మారికి దారితీసిందని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందోనని జనాలు భయపడుతున్నారు. ఇలాంటి గ్రహ సంయోగం ఉన్నప్పుడల్లా ఏదో ఒక అరిష్టానికి తెరతీసినట్లవుతోందనేది కొంత కాలంగా జ్యోతిష్య పండితులు చెబుతూ వస్తున్నారు. 2019లో డిసెంబరు 26 నుంచి 28 వరకు షష్ఠ గ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో కరోనా వైరస్ చైనాలో బయటకు వచ్చి.. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది.
1962 ఫిబ్రవరిలో కూడా షష్ఠగ్రహకూటమి
1962 ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ఇలాంటి షష్ట గ్రహ కూటమి ఏర్పడింది. ఆ ఏడాది రష్యా, అమెరికాలు సంక్షోభాల్లో చిక్కుకున్నాయి. ఈ పరిణామం యుద్దాలకు దారితీసింది. 2019 డిసెంబరులో ధనుస్సు రాశిలో శని, కేతువు, గురువు, చంద్ర, రవి, బుధ గ్రహాలు కలిశాయి. కచ్చితంగా అదే సమయంలోనే వైరస్ ప్రబలడం మొదలైంది. ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడటం అరుదైన విషయమే అయినా దీనికి వైరస్ పుట్టుకకూ ఏదైనా సంబంధం ఉందా లేదా అనేది తేలాలి.
జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసకర పరిస్థితులు రావడానికి ఆస్కారం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 60 గంటలతోపాటు రాబోయే రెండు నెలల్లో కొన్ని విపత్కర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందనేది వారి వాదన. ఏది ఏమైనా విశ్వంలో జరిగే ఈ అద్భుత ఖగోళ సంఘటన ఒక మరుపురాని ఘట్టంగా మిగిలిపోతుంది.