పిల్లలకు కంటి సమస్య.. తల్లికి మానసిక సమస్య!..గాజులరామారం ఘటనకు కారణం అదేనా?

పిల్లలకు కంటి సమస్య.. తల్లికి మానసిక సమస్య!..గాజులరామారం ఘటనకు కారణం అదేనా?
  • ఇద్దరు పిల్లలను కత్తితో నరికి తల్లి ఆత్మహత్య
  • హైదరాబాద్​లోని గాజులరామారంలో ఘటన
  • అనారోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి తెగించినట్లు సూసైడ్​ నోట్​

జీడిమెట్ల, వెలుగు: ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపి ఆ తర్వాత బిల్డింగ్​పై నుంచి దూకి  ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్​ శివారులోని గాజులరామారంలో జరిగింది. తన పిల్లలు, తాను అనారోగ్యంతో బాధపడుతున్నామని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ తల్లి రాసిన ఓ సూసైడ్​ నోట్​ పోలీసులకు లభించింది.  

ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర్​రెడ్డి, తేజస్విని(35) దంపతులకు హర్షిత్ (11), ఆశీష్ (7) అనే ఇద్దరు కుమారులు. ఈ కుటుంబం నాలుగేండ్ల కింద జీవనోపాధికోసం హైదరాబాద్​కు వచ్చింది. గాజులరామారం బాలాజీ లే అవుట్​లోని సహస్ర మహేశ్​ హైట్స్​అపార్ట్​మెంట్​లో నివసిస్తున్నారు.  వెంకటేశ్వర్​రెడ్డి ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు. 

గురువారం వెంకటేశ్వర్​రెడ్డి డ్యూటీ వెళ్లగా.. సాయంత్రం 4 గంటలకు తేజస్విని తన ఇద్దరు పిల్లలను కొబ్బరి బోండాల కత్తితో నరికి చంపింది. తర్వాత అపార్ట్​మెంట్​ఆరో అంతస్తుపైకి వెళ్లి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు హర్షిత్​ అక్కడికక్కడే చనిపోగా.. చిన్న కొడుకు అశీష్​ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

పిల్లలకు కంటి సమస్య.. తల్లికి మానసిక సమస్య!

సంఘటనాస్థలంలో పోలీసులకు సూసైడ్​నోట్​ లభించింది. దాని ఆధారంగా స్థానికులను విచారించారు. ప్రాథమిక విచారణలో తేజస్విని మానసిక పరిస్థితి సరిగా లేదని, తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవని చెప్పారు. తేజస్వినితోపాటు ఇద్దరు పిల్లలకు కంటి సమస్యలున్నాయని.. పిల్లలకు ప్రతి రెండు, మూడు గంటలకోసారి కండ్లలో డ్రాప్స్​ వేస్తే గానీ వారికి సరిగ్గా కనబడదన్నారు. 

ఆమెకు అనారోగ్య సమస్యలు , పిల్లలకు కంటి సమస్యలు ఉండడంతో మరింత డిప్రెషన్​లోకి వెళ్లిందని చెప్పారు. ఈ డిప్రెషన్​లోనే బిడ్డలను నరికి చంపి తానూ ఆత్మహత్య చేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.