
- కిలో బంతి రూ.20 నుంచి 30 అమ్మకం
- చామంతి రూ.80 నుంచి 100
- గులాబీ రూ.60 నుంచి 80
మెహిదీపట్నం, వెలుగు: శివరాత్రి నాడు పూలు అగ్గువకే దొరికాయి. తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి బుధవారం రెట్టింపు స్థాయిలో పూలు రావడంతో ధరలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. రెండు రోజుల కింద ఉన్న రేట్లు పండుగ నాడు లేవన్నారు. సోమ, మంగళవారాల్లో కిలో బంతిపూలు రూ.40 నుంచి 50, చామంతి రూ.100 నుంచి 150, గులాబీ కిలో రూ.100 పైనే పలికింది..
కానీ, శివరాత్రి సందర్భంగా బుధవారం కిలో బంతిపూలు రూ. 20 నుంచి 40, చామంతి కిలో రూ.80 నుంచి రూ.100, గులాబీ రూ. 60 నుంచి రూ.80 అమ్ముకోవాల్సి వచ్చిందని వ్యాపారి గోపాల్ తెలిపారు. శివరాత్రి రోజున పూలు తక్కువగా కొంటారని, మారేడు పత్రి (బిల్వపత్రాలు), గోగిపువ్వు(మోదుగు పూలు), జిల్లేడు పూలు, మారేడు కాయలు కొనడానికి ఆసక్తి చూపడంతో గిరాకీ లేదని వ్యాపారి సత్యం చెప్పారు. ఈ రెండు రోజులు పెండ్లిళ్లు కూడా లేవని, బిజినెస్కూడా తగ్గిందన్నారు.