
- సిగరెట్ విషయంలో గొడవ.. యువకుడు హత్య
- వరంగల్ జిల్లా సంగెం మండలంలో ఘటన
పర్వతగిరి (సంగెం), వెలుగు: ఓ యువకుడు వదిలిన సిగరెట్ పొగ మరో యువకుడి పైకి వెళ్లడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో 9 మంది కలిసి సిగరెట్ తాగిన యువకుడిని కొట్టడంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్లలో ఆదివారం రాత్రి జరిగింది.
పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం మండలం కుంటపల్లికి చెందిన చిర్ర ధని, అతడి సోదరుడు చిర్ర బన్నీ (21), తల్లి పూల, సోదరి పూజిత, ఫ్రెండ్ గిరిబాబుతో కలిసి ఆదివారం రాత్రి గవిచర్లలో జరిగిన గుండ బ్రహ్మయ్య జాతరకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోగా.. బన్నీ మాత్రం తన ఫ్రెండ్స్తో అక్కడే ఉన్నాడు. ఈ టైంలో బన్నీ ఓ షాప్ వద్ద సిగరెట్ తాగుతున్నాడు.
ఈ క్రమంలో బన్నీ వదిలిన సిగరెట్ పొగ అక్కడే ఉన్న గవిచర్లకు చెందిన వేల్పుల సిద్ధు పైకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అక్కడే ఉన్న సిద్దు అన్న వినయ్ వారికి నచ్చజెప్పి సిద్దుతో సారీ చెప్పించి అక్కడి నుంచి పంపించేశాడు. దీన్ని మనసులో పెట్టుకున్న సిద్దు.. తన మేనమాము గుండేటి సునీల్, ఫ్రెండ్స్ గుండేటి రాజు, కార్తీక్, మహేందర్, మెట్టుపల్లి భరత్, చిన్న భరత్, రాజ్కుమార్, కొమ్మాలుతో కలిసి వచ్చి బన్నీపై దాడి చేశాడు.
గమనించిన చుట్టుపక్కల వారు బన్నీని రక్షించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రంగా గాయపడ్డ బన్నీ అక్కడే కుప్పకూలిపోగా.. సిద్దు తన ఫ్రెండ్స్తో పరార్ అయ్యాడు. స్థానికులు బన్నీని 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించగా అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి అన్న ధని ఫిర్యాదుతో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.