వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్​ రేప్​.. ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం

వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్​ రేప్​.. ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం
  • ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అత్యాచారం చేసిన బాధితురాలి స్నేహితుడు
  • గుడికి పోదామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు
  • హోటల్ లో లంచ్​ అని ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం
  • విషయాన్ని పోలీసులకు చెప్పని లాడ్జి నిర్వాహకులు 
  • బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన

వరంగల్/వరంగల్​ సిటీ, వెలుగు: తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఓ యువతిపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు ఆమె స్నేహితుడు. వరంగల్  జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు వరంగల్  జిల్లాలో బొల్లికుంటలోని ఓ కాలేజీలో చదువుతోంది. భూపాలపల్లి హనుమాన్​నగర్​కు చెందిన ప్రధాన నిందితుడు తాటి శివరాజ్​కుమార్..​ నర్సంపేట లక్నేపల్లిలోని బిట్స్​ ఇంజినీరింగ్​ కాలేజీలో బీటెక్​ సెకండియర్​ చదువుతున్నాడు. ఇతనికి గోదావరిఖనికి చెందిన కూచన మణిదీప్, కొడం వివేక్​ మిత్రులుగా ఉన్నారు. ఈ క్రమంలో శివరాజ్​కు భూపాలపల్లికి చెందిన పుట్టపాక శరత్​ అనే స్నేహితుడి ద్వారా మూడేండ్ల క్రితం బాధితురాలు పరిచయం అయింది. కొన్ని రోజుల తర్వాత శివరాజ్​ ఆమెపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. ఫ్రెండ్ గా మాత్రమే ఉంటానని చెప్పింది. అప్పటి నుంచి బాధితురాలిపై శివరాజ్  కక్ష పెంచుకున్నాడు.

ప్లాన్  చేసి సామూహిక అత్యాచారం
ఈ క్రమంలో శివరాజ్, మణిదీప్, వివేక్.. ఆ యువతిపై రేప్  చేసేందుకు ప్లాన్  చేశారు. ప్లాన్​ ప్రకారం ఆగస్టు 15వ రోజే ముగ్గురూ కలిసి మణిదీప్ ​ కారులో బొల్లికుంటలోని బాధితురాలు చదివే కాలేజీ వద్దకు చేరుకున్నారు. ‘‘నీ కోసం వచ్చాను. ఏదైనా టెంపుల్​కు వెళ్దాం” అని శివరాజ్  యువతికి చెప్పి బయటకు రమ్మన్నాడు. బాధితురాలు కారు వద్దకు వచ్చాక మరో ఇద్దరు ఉండటాన్ని గమనించింది. దీంతో శివరాజ్  వెంట వెళ్లడానికి నిరాకరించింది. వారిద్దరు తన క్లోజ్  ఫ్రెండ్స్  అని, అందరం కలిసి గుడికి వెళ్దామని, తర్వాత లంచ్ ​ చేద్దామని శివరాజ్  ఆ యువతిని బలవంతంగా తీసుకువెళ్లాడు. నిందితులు మధ్యలో బీర్లు కొనుగోలు చేశారు. హోటల్ లో లంచ్​ అని చెప్పి వరంగల్​ బస్టాండ్​ సమీపంలోని ఓయో లాడ్జిలోకి ఆమెను తీసుకువెళ్లారు. ముందస్తు స్కెచ్​ ప్రకారం నిందితులు ఆమెను బెదిరించి గ్యాంగ్​ రేప్​ చేశారు.

యువతి గట్టిగా అరవడంతో లాడ్జి సిబ్బంది గది వద్దకు వచ్చి వారితో రూం ఖాళీ చేయించారు. కాగా, ఈ విషయాన్ని ఎక్కడైనా చెబితే చంపేస్తామని యువతిని నిందితులు హెచ్చరించారు. ఈ విషయం తెలిస్తే నీ పరువే పోతుందని బెదిరించారు. అదే సమయంలో కాలేజీలో ఎగ్జామ్స్​ ఉండడంతో బాధితురాలు విషయాన్ని మనసులోనే పెట్టుకుంది. పరీక్షలు పూర్తయ్యాక తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి చెప్పింది. ఈ నెల 1న వరంగల్​ ఇంతేజార్​గంజ్​ పోలీస్​ స్టేషన్ లో ముగ్గురిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం సాయంత్రం లక్నేపల్లిలోని బిట్స్​ కాలేజీ ప్రాంతంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వరంగల్​ ఏసీపీ నందిరాం నాయక్, ఇంతేజార్ గంజ్  సీఐ శివకుమార్ ​తెలిపారు. ఆ ముగ్గురిని రిమాండ్​కు తరలించామని పేర్కొన్నారు.