మెదక్​ జిల్లాలో కొత్త సార్లొస్తున్నరు

మెదక్​ జిల్లాలో కొత్త సార్లొస్తున్నరు
  • మెదక్​ జిల్లాలో 310 పోస్టులు ఖాళీ
  • డీఎస్సీ రిజల్ట్​ రావడంతో భర్తీకి అవకాశం
  • 1:3 లెక్కన సర్టిఫికెట్ల పరిశీలన
  • 9న నియామక పత్రాల జారీ

మెదక్, వెలుగు: సర్కారు బడుల్లో టీచర్ల కొరత తీరనుంది. ప్రభుత్వం టీచర్స్​కు ప్రమోషన్స్, ట్రాన్స్​ఫర్స్ ప్రక్రియ చేపట్టడంతో స్కూళ్లలో ఖాళీలు ఏర్పడ్డాయి. జిల్లాలోని 21  మండలాల్లోని స్కూళ్లలో స్కూల్​ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్​టీచర్స్​ కలిపి 310 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇందులో ఎస్జీటీ పోస్టులు 178, స్కూల్​ అసిస్టెంట్101, లాంగ్వేజ్​ పండిట్స్​30, పీఈటీ ఒక పోస్ట్​ ఖాళీగా ఉంది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూళ్లలో టీచర్ల కొరత వల్ల బోధనకు ఆటంకం ఏర్పడుతోంది. సిలబస్ సకాలంలో పూర్తికాక స్టూడెంట్స్​నష్ట పోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో  ప్రభుత్వం డీఎస్సీ రిజల్ట్ విడుదల చేయడంతో ఖాళీ టీచర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది.  

ఖాళీలు ఇలా..

సెకండరీ గ్రేడ్​ టీచర్స్​(ఎస్జీటీ) తెలుగు 136, ఎస్జీటీ ఉర్దూ 20, ఎస్జీటీ స్పెషల్​ ఎడ్యుకేషన్​ 26, లాంగ్వేజ్​ పండిట్​హిందీ 15, తెలుగు 13, ఉర్దూ2 , ఫిజికల్​ఎడ్యుకేషన్​టీచర్స్​(తెలుగు) ఒకటి, స్కూల్​ అసిస్టెంట్స్​ బయోలాజికల్​ సైన్ (తెలుగు) 18, ఉర్దూ ఒకటి, ఇంగ్లీష్​11, హిందీ 4,  మ్యాథమెటిక్స్​ (తెలుగు) 17, మ్యాథమెటిక్స్​ ఉర్దూ ఒకటి, ఫిజికల్​ ఎడ్యుకేషన్​ (తెలుగు) 2, ఫిజికల్​ సైన్స్​ (తెలుగు) 7, ఫిజికల్​ సైన్స్​ ఉర్దూ ఒకటి, స్పెషల్​ ఎడ్యుకేషన్​ (తెలుగు) 9, సోషల్​ స్టడీ (తెలుగు) 24, సోషల్​స్టడీ (ఉర్దూ) ఒకటి, తెలుగు 4, ఉర్దూ ఒక పోస్ట్​ ఖాళీగా ఉన్నాయి.

సర్టిఫికెట్ల పరిశీలన

2023–- 24 డీఎస్సీ రిజల్ట్​ఇటీవల విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 310 ఖాళీలు ఉండగా క్వాలిఫై అయిన అభ్యర్థులను 1:3 లెక్కన సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. మెదక్​లో డీఈవో పర్యవేక్షణలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 5వ తేదీ వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 9న ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగ నియమాక పత్రాలు అందిస్తారు.