
పాట్నా: పరీక్షలో ఆన్సర్స్ చూపించలేదని ఓ పదవ తరగతి స్టూడెంట్ తన క్లాస్ మేట్ను దారుణంగా కాల్చి చంపాడు. ఈ షాకింగ్ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోహ్తాస్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్, సంజిత్ కుమార్ పదవ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న టెన్త్ బోర్డు ఎగ్జామ్లో తనకు ఆన్సర్స్ చూపించాలని అమిత్ కుమార్, సంజిత్ కుమార్ను అదే క్లాస్కు చెందిన మరో బాలుడు కోరాడు. అందుకు అమిత్ కుమార్, సంజిత్ కుమార్ నిరాకరించారు.
ఈ విషయంలో ముగ్గురు మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని మనస్సులో పెట్టుకున్న బాలుడు.. గురువారం (ఫిబ్రవరి 20) సోషల్ ఎగ్జామ్ రాసి అమిత్ కుమార్, సంజిత్ కుమార్ ఇంటికి వెళ్తుండగా వీరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. గమనించిన స్థానికులు అమిత్, సంజిత్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన అమిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. సంజిత్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించారు.
Also Read :- లిఫ్ట్లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడి మృతి
పోలీసులు దర్యాప్తులో మైనర్ బాలుడు కీలక విషయాలు వెల్లడించారని పోలీసులు తెలిపారు. పరీక్షలో సమాధానం చూపించలేదని తన ఫ్రెండ్స్ను హత్య చేయలేదని.. వారు గత ఏడాదిగా తనను వేధిస్తున్నారని.. అందుకే హత్య చేసినట్లు నిందితుడు పేర్కొన్నాడు. బాలుడు హత్యకు ఉపయోగించిన తుపాకీ ఎక్కడ నుంచి తీసుకొచ్చాడనే దానిపై పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని.. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.