
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ను ఐసీసీ అవార్డు వరించింది. ఈ ముంబై బ్యాటర్ 2025 మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఐసీసీ ఈ విషయాన్ని మంగళవారం (ఏప్రిల్ 15) అధికారికంగా ప్రకటించింది. మార్చి 2025 లో శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతంగా ఆడాడు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ అందరికంటే బాగా రాణించాడు. మార్చి నెలలో అయ్యర్ 3 మ్యాచ్ల్లో 172 పరుగులు చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చివరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్పై శ్రేయాస్ 98 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్లో 45 పరుగులు చేసిన అయ్యర్.. ఆ తర్వాత ఫైనల్లోనూ ఒత్తిడిలో 48 పరుగులు చేసి అక్షర్ పటేల్ తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 43 యావరేజ్ తో 243 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్ గా నిలిచాడు.
అవార్డు గెలిచినా తర్వాత శ్రేయాస్ అయ్యర్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు "మార్చి నెలలో ఐసీసీ మెన్స్ ప్లేయర్ గా ఎంపిక కావడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ గుర్తింపు చాలా ప్రత్యేకమైనది. ముఖ్యంగా మనం ఐసీసీ ట్రోఫీని పైకి ఎత్తిన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. పెద్ద టోర్నీలో టీమిండియా విజయానికి కారణమవ్వడం నా కల. నా సహచరులు, కోచ్లు, సహాయక సిబ్బందికి నేను కృతజ్ఞుడను" అని అయ్యర్ అన్నాడు. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకుంది.
అయ్యర్ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బ్యాటర్ గా, కెప్టెన్ గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయ్యర్ సారధ్యంలోని పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు గెలిచింది. బ్యాటర్ గాను సత్తా చాటుతూ ఐదు మ్యాచ్ ల్లో 250 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
SHREYAS IYER WON ICC PLAYER OF THE MONTH AWARD. 🌟 pic.twitter.com/vL18gLjnI3
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025