సీఐ పోస్టు రాలేదని ఎస్ఐ ఆత్మహత్య

సీఐ పోస్టు రాలేదని ఎస్ఐ ఆత్మహత్య

అంబర్‌పేట్ సీసీఎస్‌లో ఎస్ఐ‌గా విధులు నిర్వహిస్తున్న సైదులు గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సైదులు 2007వ సంవత్సరంలో ఎస్సైగా విధుల్లో చేరాడు. నగరంలోని మొగల్పురా పీఎస్‌తో పాటు ట్రాఫిక్ వింగ్‌లో ఎస్ఐ సైదులు 2017 వరకు విధులు నిర్వహించాడు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌కు బదిలీ అయ్యాడు. సైదులు రెండు సంవత్సరాల నుంచి డిస్క్ సమస్యతో భాదపడుతున్నాడు. దాంతో సిక్ లీవ్ తీసుకొని గత నెల నవంబర్‌లో తిరిగి విధుల్లో చేయడానికి రిపోర్ట్ చేయగా.. సైదులును సీపీఎస్‌కు బదిలీ చేశారు. సైదులు సిక్ లీవ్‌లో ఉన్న సమయంలో ఆయన తోటి ఎస్ఐ‌లు సీఐలుగా ప్రమోషన్ పొందారు. తాను ఇంకా ఎస్ఐగానే ఉంటే, తన స్నేహితులు మాత్రం సీఐలు అయ్యారనే తీవ్ర భాదలో మానసిక క్షోభకు గురి అయ్యాడు. సోమవారం ఉదయం సైదులు భార్య నిర్మల పిల్లల్ని స్కూల్లో దించడానికి వెళ్ళినప్పుడు సైదులు ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబర్‌పేట్ పోలీసులు సైదులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.