విద్యార్థులు ఇష్టంతో చదవాలి : అడిషనల్ కలెక్టర్  గరిమా అగర్వాల్ 

విద్యార్థులు ఇష్టంతో చదవాలి : అడిషనల్ కలెక్టర్  గరిమా అగర్వాల్ 
  • చేర్యాల మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల స్కూల్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్​వాడీ సెంటర్ ఆకస్మికంగా తనిఖీ  

చేర్యాల, వెలుగు: విద్యార్థులు ఇష్టంతో చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్​ గరిమా అగర్వాల్​సూచించారు. చదువులో ఎలాంటి సందేహాలు వచ్చినా టీచర్లతో చర్చించి నివృత్తి చేసుకోవాలని పేర్కొన్నారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల స్కూల్, ప్రభుత్వ ఆస్పత్రి, అంగన్​వాడీ సెంటర్ ను ఆమె సందర్శించి తనిఖీ చేశారు.

ముందుగా స్కూల్ లో  టెన్త్​క్లాస్​విద్యార్థులకు పాఠాలు చెప్పారు.  వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ప్రతి క్వశ్చన్ కు ఆన్సర్స్ చెప్పి ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ చదువులో పోటీ ప్రపంచంలో రాణించాలంటే గొప్ప వ్యక్తుల  జీవిత చరిత్రలను చదవాలని సూచించారు. టెన్త్​ క్లాస్​విద్యార్థులు 10 జీపీఏ సాధించి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు.

వసతి రూమ్​లు, కిచెన్​లను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం నాణ్యతతో అందిస్తున్నారా.. లేదా అని వండిన వంటలను చెక్ చేశారు. నాణ్యతతో వంట చేయకుంటే చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ ను  హెచ్చరించారు. ఈరోజు మెనూ మేరకు అందించకపోవడాన్ని గుర్తించి కాంట్రాక్టర్ కు మెమో ఇవ్వాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. స్కూల్​ కాంప్లెక్స్​లో మురుగునీటిని వెంటనే బయటికి పంపేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​అధికారులకు సూచించారు.

 అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పేషెంట్లకు అందించే వైద్య సేవలను పరిశీలించారు. వార్డుల్లో తిరిగి రోగులను వైద్యసేవలపై అడిగి తెలుసుకున్నారు. కుర్మవాడలోని అంగన్​వాడీ –-1 సెంటర్ ను కూడా తనిఖీ చేసి అటెండెన్స్ ,  సేవలపై ఆరా తీశారు. ఆమె వెంట తహసీల్దార్ సమీర్ అహ్మద్​ఖాన్, ఎంపీడీఓ మహమూద్​అలీ, మున్సిపల్​ కమిషనర్​ఎస్​.నాగేందర్​, ఎంఈఓ కిష్టయ్య, ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్​, ఆర్ఐ రాజేందర్​రెడ్డి సిబ్బంది ఉన్నారు.