
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్(ఐవోసీ) బిల్డింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని, ఆఫీసులను అందులోకి షిఫ్ట్ చేయాలని సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆఫీసర్లను ఆదేశించారు. అన్ని పనులు పూర్తయినా ఆఫీసుకు కీలకమైన మిషన్ భగీరథ నీటి కనెక్షన్ పనులు కాకపోవడంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఐవోసీ బిల్డింగ్ను పరిశీలించి మాట్లాడారు.
త్వరలోనే కాంప్లెక్స్ను ఓపెన్ చేసి సేవలు అందించనుండడంతో జిల్లా అధికారులు డివిజన్ ఆఫీసులను అందులోకి షిఫ్ట్ చేయాలన్నారు. కాంప్లెక్సులోని అన్ని ఆఫీసులకు ఫర్నిచర్ను అందజేస్తామన్నారు. పనుల్లో స్పీడ్ పెంచాలన్నారు. నిర్మాణ దశలో ఉన్న సెకండ్ ఫ్లోర్ అడ్మిషన్స్ శాంక్షన్స్ పూర్తి చేసుకొని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ వెంట హుస్నాబాద్ ఆర్డీవో బెన్ శాలోం, డీఎస్వో శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మూర్తి, డీటీవో బాలరాజు, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డీపీవో దేవకీదేవి, డీఏవో తదితరులున్నారు.