
న్యూయార్క్: అమెరికాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ టెక్ దిగ్గజం, సీమెన్స్ కంపెనీ సీఈవో అగస్టీన్ ఎస్కొబార్(55) చనిపోయారు. అగస్టీన్తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, హెలికాప్టర్ పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం మధ్యాహ్నం హడ్సన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగానికి అగస్టీన్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. భార్య మెర్సీ(40), ముగ్గురు పిల్లలతో కలిసి ఆయన అమెరికాలోని న్యూయార్క్ టూర్లో ఉన్నారు. వీళ్లంతా కలిసి శుక్రవారం మధ్యాహ్నం మాన్హట్టన్ హెలిపోర్ట్ నుంచి సైట్ సీయింగ్కు హెలికాప్టర్లో బయల్దేరారు. చాపర్ జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జి వరకు వెళ్లి మలుపు తిరుగుతుండగా హడ్సన్ నది వద్ద ప్రమాదం జరిగింది.
గిరిగిరా తిరుగుతూ నదిలో పడిపోయింది. సమస్యేంటో తెలియలేదుగానీ, హెలికాప్టర్ గాల్లో ఉండగానే రెక్కలు, బాడీ రెండు ముక్కలుగా విడిపోయి వేర్వేరుగా నీళ్లలో కుప్పకూలాయి. దీంతో అగస్టీన్తోపాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, పైలట్ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే రెస్క్యూ సిబ్బంది స్పాట్కు చేరుకుని వాళ్ల మృతదేహాలను వెలికితీశారు. హెలికాప్టర్ కూలుతున్నప్పుడు అక్కడున్నవాళ్లు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను సైట్ విజిటింగ్ కోసం వినియోగించే న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ విభాగానికి చెందిన బెల్ 206 చాపర్గా అధికారులు గుర్తించారు. చాపర్ టేకాఫ్ అయిన 16 నిమిషాల్లోపే ప్రమాదానికి గురైందని తెలిపారు. ప్రమాద ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.