ప్రతి మాసంలోను రెండు పక్షాలు ఉంటాయి .. ఒక్కో పక్షంలో ఒక ఏకాదశి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఏకాదశి కూడా విశేషమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది. అలా వచ్చే భాద్రపద శుక్ల ఏకాదశిని ( సెప్టెంబర్ 25) పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏడాది పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ 25న వచ్చిందని పండితులు చెబుతున్నారు. పరివర్తన ఏకాదశి అంటే ఏమిటి ? దాని ప్రత్యేకత ఏమిటి ? ఆ రోజు ఏ దేవుడిని పూజించాలి.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయి .. పురాణాలు ఏంచెబుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. .. .
ఆషాఢ శుద్ధ ఏకాదశి (జూన్ 29) రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు....భాద్రపద శుద్ధ ఏకాదశి ( సెప్టెంబర్ 25) రోజున ఎడమ వైపు నుంచి కుడి వైపుకి ఒత్తిగిల్లుతాడట. అలా స్వామి ఒక వైపు నుంచి మరో వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కనుక, దీనిని పరివర్తన ఏకాదశి అని అంటారు. శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక... దీనిని పరివర్తన ఏకాదశిగా పిలుస్తుంటారు.
పరివర్తన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును వ్రత విధానం ద్వారా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించ వలసి వుంటుంది. వివిధ రకాల కారణాల వలన అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.
పూజా విధానం
- ఈ రోజున (సెప్టెంబర్ 25) ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి … ఉపవాస దీక్షను చేపట్టి … జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది.
- సెప్టెంబర్ 25 శ్రీహరిని పూజించడం వల్ల వ్యక్తుల్లో పరివర్తన చోటుచేసుకోవడమే కాదు, అత్యంత ప్రయోజనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారట. ఈ ఏకాదశి నాడు శ్రీహరిని పూజిస్తే తీరని కోరికలు నెరవేరతాయని వేదాల్లో పేర్కొన్నారు.
- భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున(సెప్టెంబర్ 25)న శ్రీమహావిష్ణువుకు వసుపు వస్త్రంతోపాటు అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించడం వల్ల మనసులోని కోరికలు నెరవేరతాయని విష్ణుపురాణంలో చెప్పారని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
- కృష్ణావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువుకు వెన్న, కలకండ (పటిక బెల్లం) నైవేద్యంగా పెట్టడం వల్ల మీ అన్ని కోరికలు నెరవేరడానికి సహాయపడుతుందని పండితులు అంటున్నారు.
- విష్ణువుతోపాటు లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తే అదృష్టం మీ వెంట ఉంటుంది.
- శంఖం ఊది చిన్ని కృష్ణుడిని ఆహ్వనించి కేసరి, పాలు సమర్పించాలి.
- నిరుపేదలకు పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయట.
ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ
పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ”
అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.
పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా కూడా పరిగణిస్తారు. కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామనావతారాన్ని ఎత్తి మహాబలిని పాతాళ లోకానికి పంపిస్తాడని వేదాలు చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం వలన బ్రహ్మ -విష్ణు -మహేశ్వరులని సేవేస్తే కలుగే ఫలం లభిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి.