కోల్​ బంకర్లకు పగుళ్లు.. సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం

కోల్​ బంకర్లకు పగుళ్లు.. సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం
  • రూ. 398కోట్ల పనుల్లో ఆఫీసర్ల నిర్లక్ష్యం
  • సింగరేణికి రూ.కోటికి పైగా అదనపు భారం
  • పగుళ్లతో కోల్​ను స్టాక్​ చేసుకోలేని దుస్థితి

భద్రాద్రికొత్తకొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో కొందరు ఆఫీసర్ల అవినీతి, నిర్లక్ష్యం వల్ల సంస్థకు నష్టాలొచ్చే పరిస్థితి నెలకొంది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో చాలా పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. కొత్తగూడెం ఏరియాలోని జేవీఆర్​ ఓసీలో రూ. 398కోట్లతో నిర్మించిన కోల్​ బంకర్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో క్వారీ నుంచి బొగ్గును లోడింగ్​ పాయింట్​ వద్దకు తీసుకొచ్చే కన్వేయర్​ బెల్ట్​బ్రేక్​ డౌన్​అయితే ట్రాన్స్​పోర్టు పూర్తిగా ఆగిపోనుంది. పిల్లర్లను రిపేరు చేసేలోగా ట్రాన్స్​పోర్ట్​ ఆగకుండా ఆఫీసర్లు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల సంస్థపై అదనంగా రూ. కోటి భారం పడనుంది. 

 మూడు బంకర్ల పిల్లర్లకు పగుళ్లు 

బొగ్గు ట్రాన్స్​పోర్టు మెరుగ్గా చేసేందుకు 2022మేలో జేవీఆర్​ ఓసీ ప్రాంతంలో రూ. 398కోట్లతో కోల్​ బంకర్లు, కన్వేయర్​ బెల్ట్స్​తదితర పనులు ప్రారంభించారు. మూడు బంకర్లు నిర్మించి ఏడాదికి 10 మిలియన్​ టన్నుల బొగ్గు రవాణా చేసే ఈ పనులను సమంతా అనే కంపనీ టెండర్​ ద్వారా దక్కించుకుంది. క్వారీ నుంచి వచ్చే బొగ్గును గ్రేడ్లవారీగా బంకర్లలో నిల్వ చేయాలని ప్లాన్​ చేశారు. రెండో బంకర్​లో గతఏడాది జూలైలో పగుళ్లు ఏర్పడ్డాయి. నవంబర్​లో మొదటి బంకర్​లో, రెండు వారాల కింద మూడో బంకర్​ పిల్లర్లకు పగుళ్లు పడ్డాయి. 

ఈ బంకర్ల నిర్మాణం విషయంలో సింగరేణి సివిల్​ ఆఫీసర్ల పర్యవేక్షణ లేకపోవడంవల్లనే నాసిరకం పనులు జరిగాయంటున్నారు. 25ఏండ్లకు పైగా చెక్కుచెదరకుండా ఉండాల్సిన బంకర్లు రెండున్నరేండ్లకే పగుళ్లు రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్​ వర్క్​ చేసిన కంపనీ కనీసం 3 నుంచి 5ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యత చూసుకోవాలి.

కానీ, సమంతా కంపనీతో సింగరేణి కేవలం ఏడాది మాత్రమే నిర్వహణ బాధ్యతలు చూసేలా అగ్రిమెంట్​ చేసుకోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిజైన్​లో పేర్కొన్నవిధంగా స్టీల్​వాడలేదని, అందువల్లే పగుళ్లు ఏర్పడుతున్నాయంటూ ఐఐటీ రీసెర్చ్​స్టూడెంట్స్ సర్వేలో తేలిందని అంటున్నారు. 

సంస్థపై ఆర్థిక భారం : రైల్వే వ్యాగన్లు లోడింగ్​ పాయింట్​ వద్దకు వచ్చిన మూడు గంటల్లోపు లోడింగ్​ జరగపోతే రైల్వేలకు సింగరేణి రూ. లక్షల్లో డ్యామరేజ్​ చార్జీలు చెల్లించాల్సిఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకే అధునాతనంగా కోల్​ బంకర్లను నిర్మించింది. బంకర్లకు పగుళ్లు రావడంతో బొగ్గును అక్కడ నిల్వ చేయలేక డైరెక్ట్​గా లోడింగ్​చేస్తున్నారు.

ఈ హడావిడిలో గ్రేడింగ్​ను పట్టించుకోకపోవడం వల్ల సంస్థకు నష్టం కలిగే అవకాశాలున్నాయి. బంకర్ల రిపేర్లకు సంబంధించి సమంతా కంపనీతో యాజమాన్యం ఇటీవల చర్చలు జరిపింది. రిపేర్లు జరిగే టైంలో కన్వేయర్​ బెల్ట్​ ద్వారా డైరెక్ట్​గా వ్యాగన్లలోకి లోడింగ్​జరిగేలా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు దాదాపు రూ. కోటి వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 

అదే కంపెనీతో రిపేర్లు చేయిస్తాం

 బంకర్లు నిర్మించిన సమంతా కంపెనీతోనే రిపేర్లు చేయిస్తాం. పగుళ్లపై ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపాం. అండర్​ డిజైన్​ వల్లనే బంకర్లకు పగుళ్లు వస్తున్నాయంటూ ఐఐటీ రీసెర్చ్​ స్టూడెంట్స్​ తమ రిపోర్టులో పేర్కొన్నారు.- సూర్యనారాయణ, జీఎం, సివిల్​, సింగరేణి కాలరీస్​ కంపనీ