లీజుకు సింగరేణి జాగాలు : పెట్రోల్ బంకుల సంస్థలకు ఇచ్చేందుకు నిర్ణయం

లీజుకు సింగరేణి జాగాలు :  పెట్రోల్ బంకుల సంస్థలకు ఇచ్చేందుకు నిర్ణయం
  • స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడటం
  •  అదనపు ఆదాయం కూడా సమకూర్చుకోవడం
  •  పలు ఏరియాల్లో ప్రతిపాదిత స్థలాల గుర్తింపు
  • ఇప్పటికే స్థలాల లీజు కోసం టెండర్ల ఆహ్వానం

కోల్​బెల్ట్, వెలుగు :   సింగరేణి సంస్థ తన ఖాళీ జాగాలను లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందుకు సింగరేణివ్యాప్తంగా వర్తక, వాణిజ్య పరంగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించింది. దీంతో సింగరేణి  విలువైన తన జాగాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవడమే కాకుండా లీజు ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుందని సింగరేణి అధికా రులు భావించారు. ఇటీవల ఏడు ఏరియాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఇంధన సంస్థల నుంచి టెండర్లను కూడా ఆహ్వానించారు.  

ఎనిమిదేండ్ల కిందటే కసరత్తు

సింగరేణి ఉద్యోగులకు ఉద్యోగులకు క్వాలిటీ పెట్రోలు, డీజిల్​ను అందించాలని భావించి సూపర్​బజార్ల ఆధ్వర్యంలో పెట్రోల్​బంకుల ఏర్పాటుకు 2016 సెప్టెంబర్​లోనే సింగరేణి నిర్ణయం తీసుకుంది. అప్పట్లోనే బంకుల ఏర్పాటుకు ఆఫీసర్లు కసరత్తు చేశారు. అందుకు అవసరమైన స్థలాల సేకరణ కూడా చేపట్టారు. హెచ్​పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్​కంపెనీలు ఒక్కో ఏరియాలో రెండు నుంచి మూడు బంకులు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి.

 హెచ్​పీసీఎల్​11 పెట్రోల్​ బంకుల కోసం  స్థలాల సేకరణ పూర్తి చేశారు. ఒక్కో దానికి సుమారు రూ.4 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. స్థల సేకరణ అనంతరం 90 రోజుల్లో వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు వీటి ద్వారా సుమారు 900 మందికి ఉపాధి కూడా దొరుకుందని పేర్కొన్నారు. బంకుల ఏర్పాటుతో సూపర్​బజార్లు మరింతగా ఆదాయం సమకూర్చుకుంటాయని  భావించారు. అయితే పెట్రోల్​బంకుల ఏర్పాటు ప్రక్రియ మధ్యలోనే 
నిలిచిపోయింది.  

 30 ఏండ్ల వరకు లీజుకు..

తాజాగా సింగరేణి ఖాళీ జాగాలపై యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. మార్కెట్​విలువ ప్రకారమే  ఇంధన సంస్థకు లీజుకు కేటాయించి ఏడాదికి కొంత ఆదాయం సమకూర్చుకోనుంది. సింగరేణి ఏరియాలోని కొన్ని కార్మిక ప్రాంతాల్లో ఇంధనానికి నాలుగైదు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. దీంతో యాజమాన్యం మందమర్రి (బెల్లంపల్లి ప్రాంతం), సెంటినరీ కాలనీ, గోదావరిఖని, యైటింక్లైయిన్​కాలనీ, భూపాలపల్లి, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లో బంకుల ఏర్పాటుకు ఇంధన సంస్థకు లీజుకు  ఖాళీ స్థలాలను కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది.

 ఒక్కో బంకుకు సుమారు 748 చదరపు అడుగుల నుంచి 3,617 చదరపు అడుగుల వరకు కేటాయించనుంది. 20  నుంచి 30 ఏండ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి దాని విలువ పెంచుకునే విధంగా అగ్రిమెంట్ చేసుకోనుంది.  

అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు..

ప్రధానంగా నేషనల్​హైవేలు, మెయిన్ రోడ్ల పక్కన, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లోని సింగరేణి ఖాళీ జాగాలను  బంకులకు కేటాయించనుంది. మందమర్రి పరిధిలోకి వచ్చే బెల్లంపల్లి టౌన్ శివారు నేషనల్​ హైవేను ఆనుకొని కన్నాల, పాత కెమికల్​కాంప్లెక్స్, పాత సింగరేణి పవర్​హౌజ్​ప్రాంతాల్లో ఒక్కో చోట  సింగరేణికి 10 – 50 ఎకరాల వరకు విలువైన ఖాళీ స్థలాలు ఉండగా.. ఇవి క్రమేణా అన్యాక్రాంతమవుతున్నాయి. నేషనల్​హైవే పక్కన ఉండటంతో వీటిని పెట్రోల్​బంకులకు లీజుకు ఇస్తే ఆదాయంతో పాటు కబ్జాల బారిన పడకుండా కాపాడుకోవచ్చని సింగరేణి భావిస్తోంది.  కార్మిక ప్రాంతాల్లో పెట్రోల్​బంకులు ఏర్పాటు చేస్తే సంస్థ కార్మికులతో పాటు ఇతర వినియోగదారులకు అందుబాటులో క్వాలిటీ ఇంధనం లభించనుంది.