
- వచ్చే నెలలో టెండర్లు..
- 8 ఏరియాల్లో ప్లాంట్ల నిర్మాణం
- అక్టోబర్ నుంచి నిర్మాణాలు షురూ
- సమీక్షలో సీఎండీ ఎన్. శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: సోలార్ పవర్ జనరేషన్ లో భాగంగా సింగరేణి సంస్థ రెండో దశలో 240 మెగావాట్ల కెపాసిటీతో 8 ఏరియాల్లో సోలార్ ప్లాంట్లు ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి వచ్చే నెలలో టెండర్లు పిలవాలని, అక్టోబర్ నుంచి నిర్మాణాలు ప్రారంభించాలని సీఎండీ ఎన్. శ్రీధర్ సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో నిర్వహించిన విద్యుత్ సమీక్ష సమావేశంలో రెండో దశ సోలార్ ప్లాంట్ల నిర్మాణంపై సీఎండీ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి దశ 300 మెగావాట్ల ప్లాంట్లలో మిగిలిన 76 మెగావాట్ల కెపాసిటీ గల ప్లాంట్లను అక్టోబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో దశలో చేపట్టనున్న 240 మెగావాట్ల ప్లాంట్లను వచ్చే ఏడాది అక్టోబర్ కల్లా నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకోవాలన్నారు. మొత్తం 540 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పాదనతో కంపెనీని నెట్ జీరో కార్బన్ ఎమిషన్ కంపెనీగా నిలపడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
8 ఏరియాల్లో కొత్త ప్లాంట్లు..
రెండో దశలో సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం ఏరియాల వారీగా స్థలాలను ఎంపిక చేశారు. మందమర్రిలో 67.5 మెగావాట్ల ప్లాంట్, రామగుండం-3 ఏరియాలో 41 మెగావాట్ల ప్లాంట్, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 37.5 మెగావాట్లు, సత్తుపల్లిలో తొలిసారిగా 32.5 మెగావాట్ల ప్లాంట్, శ్రీరాంపూర్ ఏరియాలో తొలిసారిగా 27.5 మెగావాట్ల ప్లాంట్, ఇల్లెందులో15 మెగావాట్ల ప్లాంట్, భూపాలపల్లి ఏరియాలో 10 మెగావాట్ల ప్లాంట్, రామగుండం-1 ఏరియాలో తొలిసారిగా 5 మెగావాట్ల ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయించారు. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా టెండర్లను పిలిచి నిర్మాణ ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. సమావేశంలో డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు, చీఫ్ టెక్నికల్ కన్సల్టెంట్ సంజయ్ కుమార్ సుర్, థర్మల్ విద్యుత్ కేంద్రం జనరల్ మేనేజర్ బసివి రెడ్డి, చీఫ్ వో అండ్ ఎం జె.ఎన్. సింగ్, జీఎం సోలార్, జానకీరామ్, చీఫ్ ఆఫ్ పవర్ విశ్వనాథరాజు, జీఎం సివిల్ సూర్యనారాయణ, ఏజీఎం సివిల్ కేఎస్ఎన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.