- సింగరేణి క్రెడిట్సొసైటీల్లో అవినీతి, అక్రమాలు
- రూ. కోట్లలో టర్నోవర్.. రూల్స్ కు బ్రేక్!
- ఇష్టానుసారంగా చైర్మన్, డైరెక్టర్ల లావాదేవీలు
- ఫిర్యాదుతో విచారణకు ఆదేశించిన డీసీఓ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలోని క్రెడిట్కో – ఆపరేటివ్సొసైటీలు అక్రమాలకు అడ్డాగా మారాయి. పలు సొసైటీలు రూ. కోట్లలో టర్నోవర్తో నడుస్తుండగా.. వీటికి వడ్డీ వ్యాపారమే ప్రధానంగా ఉంది. కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్హెడ్డాఫీస్క్రెడిట్సొసైటీతో పాటు ఎస్ అండ్పీసీ క్రెడిట్సొసైటీల్లోనూ అవినీతిపై కొద్దిరోజుల కింద పలువురు డిస్ట్రిక్ట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఆఫీసర్లతో పాటు డీఎస్పీకి కంప్లయింట్ చేశారు. ఆయా సొసైటీల్లోని అక్రమాలపై డీసీఓ ఎంక్వైరీకి ఆదేశించారు.
డైరెక్టర్ కంప్లయింట్ తో అక్రమాలు బయటకు..
సింగరేణి వ్యాప్తంగా పలు మైన్స్, డిపార్ట్మెంట్స్లో కార్మికులు, అధికారులు మెంబర్లుగా క్రెడిట్సొసైటీలు ఏర్పాటయ్యాయి. ఒక్కో క్రెడిట్సొసైటీలో 150 –300 మంది సభ్యులుగా ఉంటారు. ఒక్కో సభ్యుడు నెలకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు సొసైటీల్లో జమ చేస్తుంటారు. అవసరమైనప్పుడు లోన్గా తీసుకుంటారు. ఇందుకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. జమ చేసిన సభ్యులకు ప్రతి ఏడాది ఆడిట్తర్వాత డివిడెంట్గా కొంత మొత్తాన్ని వాటాలుగా ఇస్తుంటారు.
ఇలా పలు సొసైటీలు డిపాజిట్లను ప్రోత్సహిస్తుండడం గమనార్హం. కొత్తగూడెంలోని ఎస్అండ్పీసీ క్రెడిట్ కో – ఆపరేటీవ్సొసైటీ రూ. 11కోట్లకు పైగా, హెడ్డాఫీస్క్రెడిట్కో ఆపరేటీవ్సొసైటీ రూ. 6 కోట్లకుపైగా టర్నోవర్తో నడుస్తున్నాయి. సాధారణం గా ఏయే డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారో అందులోని ఉద్యోగులే మెంబర్లుగా ఉంటారు. సొసైటీ చైర్మన్తో పాటు సభ్యులం తా కలిసి కొందరు డైరెక్టర్లను ఎన్నుకుంటారు. మెంబర్లు పిల్లల చదువులు, పెండ్లిలు, ఇంటి నిర్మాణాలకు రూ. 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు లోన్తీసుకుంటారు.
బ్యాంకుల కన్నా అధిక వడ్డీ వస్తుండడంతో పాటు తాము జమ చేసిన డబ్బులకు భరోసా ఉండడంతో సింగరేణి క్రెడిట్సొసైటీల్లో డిపాజిట్చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కొన్ని సొసైటీల్లో టర్నోవర్పెంపే లక్ష్యంగా నగదు జమలకు ఇతర డిపార్ట్మెంట్ల కు చెందిన వారిని ప్రోత్సహిస్తున్నారు. అయితే.. రూల్స్ కు విరుద్ధంగా మెంబర్లను చేర్చుకోవడం, డిపాజిట్లు సేకరించడం, లోన్ పూర్తిస్థాయిలో రీ పేమెంట్కాకుండానే తిరిగి లోన్లు ఇస్తుండడంపై సొసైటీల్లో సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి.
లావాదేవీల్లో తేడాలతో తలెత్తిన లొల్లి
సింగరేణి హెడ్డాఫీస్ కో ఆపరేటీవ్సొసైటీ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఓ డైరెక్టర్డిస్ట్రిక్ట్కో ఆపరేటీవ్ ఆఫీసర్కు గతనెల 17న ఫిర్యాదు చేశారు. సొసైటీ లావాదేవీలు, మెంబర్ల జాబితా, డిపాజిట్దారుల వివరాలు, విత్డ్రా డిపాజిట్దారులు, ఖర్చులు, సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్లు వంటి పలు అంశాలపై ఎన్నిసార్లు అడిగినా వివరాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇప్పటికే కార్పొరేట్ఎస్అండ్పీసీ కో ఆపరేటీవ్ క్రెడిట్సొసైటీలో చైర్మన్, డైరెక్టర్ల మధ్య లావాదేవీల్లో తేడాలతో డైరెక్టర్ల మధ్య లొల్లి నడుస్తుంది.
మెంబర్స్ కు లోన్ ఇచ్చేందుకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకు కొందరు అక్రమంగా వసూలు చేస్తున్నారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఓ డైరెక్టర్ను పదవి నుంచి తప్పించడం సొసైటీ లో చర్చనీయాంశంగా మారింది. నాన్మెంబర్ల డిపాజిట్లను రిటర్న్ చేయాలని పలుమార్లు డైరెక్టర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ పలువురు మెంబర్లు ఆరోపిస్తున్నారు.
ఈ సొసైటీలో గౌరవ సలహాదారులు, అధ్యక్షులుగా కొనసాగుతున్న వారే పెత్తనం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ సొసైటీలో ఇటీవల తలెత్తిన విభేదాలతో ఓ డైరెక్టర్ కొత్తగూడెం డీఎస్పీకి కంప్లయింట్ చేశారు. గతంలో ఇల్లెందులోని 21 ఇంక్లైన్క్రెడిట్ సొసైటీలోనూ భారీగా అక్రమాలు జరిగినట్ట ఉ ఆరోపణలు ఉన్నాయి. కొందరి వద్ద నుంచి రికవరీకి గతంలో డీసీఓ అధికారులు ఆదేశించారు. దీనిపై విచారణ చివరి దశలో ఉందని ఆఫీసర్లు పేర్కొన్నారు.
విచారణకు ఆదేశించాం
సింగరేణి హెడ్డా ఫీస్ క్రెడిట్సొసైటీలోని ఒక డైరెక్టర్ తమకు కంప్లయింట్ చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నా. కార్పొరేట్ ఎస్అండ్ పీసీ క్రెడిట్ సొసైటీ లావాదేవీలపైనా విచారణ చేస్తాం. – ఖుర్షిద్, డీసీఓ