ఎక్స్​టెన్షన్ ఆఫీసర్‌గా సింగరేణి ఉద్యోగి బిడ్డ .. ఇంట్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులే

ఎక్స్​టెన్షన్ ఆఫీసర్‌గా సింగరేణి ఉద్యోగి బిడ్డ .. ఇంట్లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులే

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని జీఎం ఆఫీస్ కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి బిడ్డ ఎక్స్​టెన్షన్​ఆఫీసర్​పరీక్షలు సత్తా చాటింది. సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్న కారంపూడి శ్రీనివాస రాజు–కృష్ణవేణి దంపతులకు కొడుకు హర్షవర్ధన్, కూతురు సంహితరాజ్ ఉన్నారు. సంహితరాజ్ ఇటీవల విడుదలైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్-1 ఎక్స్​టెన్షన్ ఆఫీసర్ పరీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 21వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 4వ ర్యాంకు సాధించి ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. 

సంహిత గతేడాది వెలువడిన గ్రూప్-4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై మైనారిటీ సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగం చేస్తూనే కష్టపడి చదివి ఈ ఉద్యోగం సాధించా నని తెలిపారు. కాగా ఈ కుటుంబంలో నలుగురు కూడా ప్రభుత్వ ఉద్యోగులే.. సంహితరాజ్ తండ్రి బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని బొగ్గు గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్​గా పనిచేస్తున్నారు. ఆమె అన్న హర్షవర్ధన్ శ్రీరాంపూర్‌లో అండర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.