
- రాజస్థాన్లో 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కసరత్తు
- తెలంగాణలోని రిజర్వాయర్లపై 800 మెగావాట్ల ప్లాంట్లకు సిద్ధం
- పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటు వైపూ ఆలోచన
- డీపీఆర్లు రూపొందించాలని సింగరేణి సీఎండీ ఆదేశాలు
కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్రంలో ఇప్పటికే థర్మల్, సోలార్ ప్లాంట్లను నడుపుతున్న సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో కూడా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్లో థర్మల్ పవర్ ప్లాంట్ ద్వారా 1,200 మెగావాట్లు, నేల మీద ఏర్పాట్లు చేసిన సోలార్ ప్యానళ్ల ద్వారా 234 మెగావాట్లు, వాటర్ ఫ్లోటింగ్ విధానంలో మరో 10 మెగావాట్లపవర్ను ఉత్పత్తి చేస్తోంది. ఇదే విధానంలో రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ప్రాజెక్టు రిపోర్ట్లను తెప్పించుకునే పనిలో పడింది. సింగరేణి సీఎండీ ఎన్. బలరాంనాయక్, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన రివ్యూ మీటింగ్లోనూ ఈ ప్లాంట్లపై చర్చ జరిగింది.
రాజస్థాన్లోని ఖాళీ స్థలాల్లో 500 మెగావాట్ల ప్లాంట్
మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ భావిస్తోంది. ఇందుకోసం రాజస్థాన్ వేదికగా 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆ రాష్ట్రంలోని ఖాళీ స్థలాల్లో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన డీపీఆర్పై అధ్యయనం చేయాలని, తక్కువ ధరకే విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో సింగరేణి సీఎండీ బలరాంనాయక్ ఆదేశించారు. తక్కువ ధరకు సోలార్ పవర్ను అందుబాటులోకి తీసుకొస్తే ఎక్కువ సంస్థలు సింగరేణి నుంచే కొనే ఛాన్స్ ఉంటుందని సీఎండీ సూచించారు. ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్నుంచి త్వరలో ఉత్పత్తి చేపట్టనున్న నేపథ్యంలో అక్కడా సోలార్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చిస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
తెలంగాణలోని రిజర్వాయర్లపై 800 మెగావాట్లు
మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్పవర్ ప్లాంట్ ఆవరణలోని రిజర్వాయర్లో 10 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ఇతర రిజర్వాయర్లపై కూడా సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సింగరేణి సిద్ధమైంది. ఇందుకు కోసం సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లోయర్ మానేరు డ్యామ్ను ఎంపిక చేసింది. మల్లన్నసాగర్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై డీపీఆర్ రూపొందించాలని సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. ఇక్కడ 500 మెగావాట్ల కెపాసిటీ గల రెండు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కరీంనగర్ ఎల్ఎండీలో 300 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కోసం ఇప్పటికే క్షేత్ర స్థాయి పరిశీలన చేయడంతో పాటు డీపీఆర్ను కూడా రెడీ చేశారు.
ఎస్టీపీపీలో మరో రెండు థర్మల్ ప్లాంట్లు
మంచిర్యాల జిల్లా జైపూర్మండలం పెగడపల్లి వద్ద 600 యూనిట్ల కెపాసిటీ గల రెండు థర్మల్ ప్లాంట్లను నడుపుతున్న సింగరేణి ప్రస్తుతం అక్కడే మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ మూడో ప్లాంట్ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన పనులు ప్రస్తుతం టెండర్ దశలో ఉన్నాయి. ఇటీవల కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా జైపూర్లోని సింగరేణి పవర్ ప్లాంట్ను సందర్శిచిన టైంలో మరో 800 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో ఈ విషయమై సింగరేణి ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై..
వ్యాపార విస్తరణలో భాగంగా పవన విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు కూడా సింగరేణి సంస్థ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో ఇందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను సందర్శించి, రిపోర్ట్ రెడీ చేయాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ సంబంధిత విద్యుత్ ఆఫీసర్లను ఆదేశించారు.