సింగరేణి బొగ్గు గనిలో కూలిన సైడ్​వాల్..సపోర్ట్​మెన్​ కు తీవ్రగాయాలు

సింగరేణి బొగ్గు గనిలో కూలిన సైడ్​వాల్..సపోర్ట్​మెన్​ కు తీవ్రగాయాలు
  • మంచిర్యాల జిల్లా  ఇందారం-1 ఏ గనిలో ఘటన 
  • తప్పుడు రిపోర్ట్​ రాశారంటూ అధికారులపై కార్మిక సంఘాల నేతల ఆగ్రహం

కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు:  సింగరేణి బొగ్గు గనిలో సైడ్​వాల్​కూలిన ఘటనలో సపోర్ట్​మెన్​కార్మికుడు  తీవ్రంగా గాయపడిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం---1ఏ అండర్​గ్రౌండ్​బొగ్గు గనిలో జరిగింది.  గురువారం మొదటి షిఫ్ట్ లో అంగల రాజయ్యతో పాటు మరో ముగ్గురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. 

ఉదయం 10 గంటల సమయంలో గనిలోని మూడో సీమ్,13డిప్​, ఏడో లెవల్​వద్ద  పైకప్పు కూలకుండా సపోర్టులు పెట్టి దిమ్మె(కర్ర) కట్టే పనులు చేపట్టారు. ఒక్కసారిగా గని సైడ్​వాల్​(సైడ్​ఫాల్) కూలి పెద్ద ఎత్తున బొగ్గు పెళ్లలు రాజయ్యపై పడడంతో ఎడమ కాలు నుజ్జునుజ్జు అయి నడుముకు గాయమైంది. మరో ముగ్గురు కార్మికులు తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన కార్మికుడిని రామకృష్ణాపూర్​ఏరియా ఆస్పత్రికి.. అటునుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్​కు తరలించారు.

 కార్మిక సంఘాల లీడర్లు, సింగరేణి ఆఫీసర్లు  వెళ్లి పరామర్శించారు. కాగా,  మూడు రోజుల కింద ఇదే బొగ్గు గనిలో డ్యూటీలో ఉండగా  కార్మికుడు రాంచందర్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఘటన మరవక ముందే మరో ప్రమాదం జరగడంతో గని కార్మికుల్లో భయాందోళన నెలకొంది. 

తప్పుడు రిపోర్ట్ రాశారంటూ కార్మిక నేతల ఆరోపణ

సైడ్​వాల్​కూలి సపోర్ట్​మెన్​కార్మికుడు రాజయ్య గాయపడితే గని ఆఫీసర్లు జారిపడ్డాడని తప్పుడు రిపోర్ట్​రాశారని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, టీబీజీకేఎస్​, సీఐటీయూ, హెచ్​ఎంఎస్​ లీడర్లు మండిపడ్డారు. గనిలో రక్షణ చర్యలు తీసుకోవడంలో  నిర్లక్ష్యంగా ఉంటున్న ఆఫీసర్లు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు రిపోర్ట్​లు రాస్తున్నట్లు ఆరోపించారు. 

అధికారుల తప్పిదాలతో ఇటీవల ఇద్దరు కార్మికులు మృతిచెందారని, ఇప్పుడు సైడ్​వాల్​కూలిన ఘటనపై తప్పుడు రిపోర్ట్​రాసిన గని ఆఫీసర్లపై డీజీఎంఎస్​కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.  గనిలో వరుస ప్రమాదాలు జరుగుతుండగా కార్మికులు ధైర్యం కోల్పోతున్నారన్నారు. ఘటన నియంత్రణలో అధికారులు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల రక్షణను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.