
కరీంనగర్, వెలుగు: మనీ ల్యాండరింగ్ కు పాల్పడ్డావంటూ కరీంనగర్కు చెందిన ఓ సింగర్ కు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేసి సీబీఐ, ఈడీ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ కు చెందిన చిలువేరు శ్రీకాంత్ సింగర్ గా, ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజర్ గా పని చేస్తున్నాడు. ఆయన ఫోన్ కు ఆదివారం మధ్యాహ్నం అతడి ఆధార్ కార్డు నంబర్ తో సీబీఐ, ఈడీ, సుప్రీంకోర్టు పేరుతో ఫేక్ లెటర్లు పంపించారు.
దీంతో పాటు మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ పేరుతో ఓ లెటర్ కూడా పంపారు. ఆ తరువాత రెండు గంటలపాటు తరచూ వీడియో కాల్స్ చేసి బెదిరించారు. కేసు ఫైల్ అయిందని, సుప్రీంకోర్టులో అడ్వకేట్ ను పెట్టుకుని వాదించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. చివరకు ఈ కేసు నుంచి బయటపడాలంటే రూ.3 లక్షలు ఇస్తే వదిలేస్తామన్నారు. ఇదంతా ఫ్రాడ్ అని భావించిన బాధితుడు శ్రీకాంత్.. హైదరాబాద్ లో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.