
రాజన్న సిరిసిల్ల, వెలుగు: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఎక్సైజ్ ఆఫీసర్లను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, ఇన్స్పెక్టర్ గులాం ముస్తఫాను సస్పెండ్ చేశారు. పట్టణంలోని చిత్ర బార్ అండ్ రెస్టారెంట్ కు నిబంధనలకు విరుద్ధంగా ట్రేడ్ లైసెన్స్ లేకుండానే 2బి లైసెన్స్ రెన్యువల్ చేసి క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించారు.
చిత్ర బార్ విషయంలో తప్పుడు వివరాలను సమర్పించి లైసెన్స్ రెన్యూవల్ చేశారని గుర్తించారు. ఇద్దరు అధికారులు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించారని తేలడంతో వేటు వేశారు. ఇదిలాఉంటే ట్రేడ్ లైసెన్స్ లేదనే కారణంతో రెండు నెలల కింద చిత్రబార్ ను మూసివేశారు.