
భద్రాచలం, వెలుగు: సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.50 లక్షలకు పైగా విరాళాలు ఇచ్చిన భక్తులకు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణంలో పాల్గొనేందుకు ఉచితంగా రెండు టిక్కెట్లు ఇస్తున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు. వారి కోసం ప్రత్యేకంగా ఒక సెక్టార్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మార్చి 26 లోపు రూ.50 లక్షలకు పైగా విరాళాలు ఇచ్చిన భక్తులు దేవస్థానంలో లేఖను అందజేయాలని సూచించారు.
ఏప్రిల్ 4 నుంచి 7 వరకు దేవస్థానం తరపున కాటేజీలు, గదులు ఇవ్వలేమని, బుకింగ్ ఉండదని చెప్పారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. తెలంగాణ ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వరరావు సీతారాముల కల్యాణానికి రూ.13 వేల విలువైన 500 గ్రాముల ముత్యాల తలంబ్రాలను ఈవోకు అందజేశారు.