ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి

ములుగు, వెలుగు: వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతిచెందారు. టిప్పర్​ డ్రైవర్ ​నిర్లక్ష్యానికి యువకు డు మృతి చెందిన ఘటన గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్​మండలంలోని కర్కపట్ల గ్రామంలో జరిగింది. ఎస్ఐ దామోదర్​కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భీమరి కరుణాకర్ (24) తన పెదనాన్న కొడుకు శ్రీకాంత్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి గుడ్లే మల్లేశ్ పొలాన్ని చదును చేస్తున్న సమయంలో టిప్పర్​డ్రైవర్​అజాగ్రత్తగా నడిపి వాహనాన్ని కరుణాకర్​పైకి ఎక్కించడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

వాటర్ సంపులో పడి రైతు.. 

వాటర్ సంపులో పడి రైతు మృతి చెందిన ఘటన ములుగు మండలంలోని తునికిబొల్లారంలో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బద్దం బలవంత రెడ్డి (34) తన పొలం దగ్గర వాటర్ సంపు నుంచి నీళ్లు రాకపోవడంతో సంపులో దిగి మోటర్ ని రిపేరు చేసి బయటకు వచ్చేటప్పుడు కాలుజారి అందులోనే పడి నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి తమ్ముడు కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ 
తెలిపారు.

 లారీ ఆటో ఢీ ఒకరు మృతి

బెజ్జంకి: లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణపురి కాలనీ వద్ద లారీ, ఆటో ఢీ కొనడంతో బెజ్జంకి క్రాసింగ్ గ్రామానికి చెందిన భిరెడ్డి నక్షత్రమ్మ (65) మృతి చెందింది. హుస్నాబాద్ ఆర్డీవో ఆఫీసులో పనిచేస్తున్న దాచారం గ్రామానికి చెందిన కొలిపాక మంజుల, బెజ్జంకికి చెందిన ఐలేని నవీన్ రెడ్డికి కాళ్లు ఫ్యాక్చర్ అయ్యాయి. 

బైక్​ అదుపుతప్పి  ఒకరు.. 

జోగిపేట: బైక్​ అదుపుతప్పి కింద పడడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆందోల్​ మండల పరిధిలోని దానంపల్లికి  చెందిన ఖానాపురం మల్లేశం, బంకుల సురేశ్​, సంగాయిపేట యాకుబ్​(55) బైక్​పై  బుధవారం రంగంపేట​ మండలంలోని దుంపలకుంట గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో  చింతకుంట శివారులో బైక్​ అదుపుతప్పి కిందపడగా యాకుబ్​కు  తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. యాకుబ్ గాంధీ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ ​బుధవారం అర్ధరాత్రి చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పాండు తెలిపారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

సిద్దిపేట : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం తొగుట మండలం ఎల్లరెడ్డిపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మన్నె భాస్కర్(35) వ్యవసాయంతో పాటు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నారు. 

పిడుగుపాటుతో వృద్ధురాలు 

బెజ్జంకి: పిడుగుపాటుతో వృద్ధురాలు మృతి చెందింది. బెజ్జంకి గ్రామానికి చెందిన టేకు రంగమ్మ (65) వర్షం వస్తుందని ఎడ్ల బండి చౌరస్తా, చింత చెట్టు దగ్గర నిల్చుని ఉండగా పక్కనే పిడుగు పడడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆమెతో ఉన్న బాలుడు ప్రవీణ్ కు గాయలవడంతో ఆస్పత్రికి తరలించారు.