జింకను చంపిన కేసులో ఆరుగురు అరెస్ట్

జింకను చంపిన కేసులో ఆరుగురు అరెస్ట్
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో జింకను వేటాడి చంపిన కేసులో ఆరుగురిని ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. అమ్రాబాద్ రేంజర్ గురుప్రసాద్ తెలిపిన ప్రకారం.. గత నెల 30న సార్లపల్లి సరిహద్దు అటవీ ప్రాంతంలో కొందరు సాంబార్ డీర్ ను వేటాడి చంపినట్లు సమాచారం అందింది.  

ఫారెస్ట్ అధికారులు వెళ్లి సోదాలు చేయగా కుడిచింతలబయలు గ్రామానికి చెందిన మండ్లి మల్లేశ్, మండ్లి చిన్న మల్లయ్య, శీలం ఈదయ్య, గోరటి శ్రీను, సార్లపల్లికి చెందిన అర్తి కొండలు, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కు చెందిన వరికుప్పల రమేశ్​ ను  అదుపులోకి తీసుకుని విచారించారు.  వన్యప్రాణి సంరక్షణ చట్టం –1997 కింద కేసు నమోదు చేసి గురువారం కోర్టులో హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించినట్లు రేంజర్ గురు ప్రసాద్ తెలిపారు.