
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్కు టీమిండియాను ఎంపిక చేసేందుకు సెలెక్షన్ కమిటీ సిద్ధం అవుతోంది. మే రెండో వారంలో 15 లేదా 16 మందితో కూడిన జట్టును ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే కొన్ని స్థానాలకు ఇప్పటికే ప్లేయర్లు ఖరారైనా.. మిడిలార్డర్కు మాత్రం గట్టి పోటీ నెలకొంది. రెండు రిజర్వ్ స్థానాల కోసం ఆరు మంది పోటీపడుతున్నారు. ఐపీఎల్లో రాణిస్తున్న సాయి సుదర్శన్, శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్, కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్తో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా రేసులో ఉన్నారు.
ఇండియా–ఎ జట్టును కూడా ఒకేసారి ఎంపిక చేయాలని భావిస్తున్న అగార్కర్ బృందం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోనుంది. డొమెస్టిక్, ఐపీఎల్ పెర్ఫామెన్స్తో పాటు గత రికార్డులను కూడా పరిశీలించనుంది. అందరూ ఫిట్గా ఉంటే రోహిత్, జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ ఆటోమేటిక్గా టీమ్లోకి వచ్చేస్తారు. ఆల్రౌండర్ స్లాట్ కోసం నితీశ్ కుమార్ రెడ్డిని పరిశీలించే చాన్స్ ఉంది. 15 మంది జట్టులో ఎక్స్ట్రా మిడిలార్డర్ బ్యాటర్ను తీసుకోవాలని భావిస్తుండటంతో పై ఆరు మంది మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సుదర్శన్ ఈ ఐపీఎల్లో టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. దీంతో రెడ్ బాల్ క్రికెట్లోనూ అతనికి ఓ చాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు యోచిస్తున్నారు. టెక్నిక్ పరంగా చాలా బలమైన సుదర్శన్ ఇప్పటికే ఇండియా–ఎ తరఫున రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 2.0గా మారాడు. గతంలో పోలిస్తే టెక్నికల్గా చాలా మెరుగయ్యాడు.