స్కిల్ వర్సిటీకి 100 కోట్లు..150 ఎకరాల భూమి : సీఎం రేవంత్ రెడ్డి

స్కిల్ వర్సిటీకి 100 కోట్లు..150 ఎకరాల భూమి : సీఎం రేవంత్ రెడ్డి
  • వర్సిటీ నిర్వహణకు నిధులివ్వాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు 
  • దసరా తర్వాత నుంచి కోర్సులు ప్రారంభించాలని నిర్ణయం  
  • వర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నామని వెల్లడి
  • స్పోర్ట్స్ వర్సిటీకి 200 ఎకరాలు కేటాయిస్తామని ప్రకటన  
  • స్కిల్ వర్సిటీ బోర్డు, పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ  

హైదరాబాద్, వెలుగు : స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాల భూమి, రూ.100 కోట్లు కేటాయించినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వర్సిటీ నిర్వహణకు పారిశ్రామికవేత్తలు సహకారం అందించాలని కోరారు. ‘‘స్కిల్ యూనివర్సిటీలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలి. వర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిధులివ్వాలి. యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి కల్పించేందుకు తమవంతు సహకారం అందించాలి” అని పిలుపునిచ్చారు. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని కోరారు. 

ఆ భవనాలకు ఆయా కంపెనీల లేదా దాతల పేర్లను పెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో గురువారం సెక్రటేరియెట్​లో సీఎం సమావేశమయ్యారు. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, స్కిల్ వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. 

ఇక స్పోర్ట్స్ వర్సిటీపై దృష్టి.. 

స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను వర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నామని చెప్పారు. 

వీలైనంత త్వరగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని, ఇక వర్సిటీ బాధ్యతలను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆనంద్ మహీంద్రా.. స్కిల్ వర్సిటీకి బ్రాండ్ ఇమేజీ తీసుకొస్తారనే నమ్మకం ఉందన్నారు. ఇక తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని చెప్పారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ వర్సిటీని నెలకొల్పి, 2028 ఒలింపిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని తెలిపారు. 

ఈ రెండు యూనివర్సిటీల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ఆర్థిక సహకారానికి మించి, ఆశించినంత చొరవ ప్రదర్శించాలి. ఈ వర్సిటీల్లో తగిన భాగస్వామ్యం, బాధ్యతలు పంచుకోవాలి” అని కోరారు. 

స్కిల్స్ తోనే ఉపాధి.. 

ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది ఉద్యోగం ఇప్పించండంటూ తన వద్దకు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని.. కానీ అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని చెప్పారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు సరిపడా మానవ వనరులు కూడా లేవని పేర్కొన్నారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకే స్కిల్ వర్సిటీ ఏర్పాటు ఆలోచన చేశామన్నారు. 

అందరికీ సరిపడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవని.. వివిధ రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకుంటే యువత ఉపాధికి ఢోకా ఉండదని చెప్పారు. కాగా, స్కిల్ వర్సిటీకి సంబంధించిన కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ‘‘మా ప్రభుత్వం హైదరాబాద్ ను ప్రపంచానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నది. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతున్నది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి” అని ఆయన పేర్కొన్నారు. 

వచ్చే నెలలో కోర్సులు ప్రారంభం.. 

ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభించాలని స్కిల్ వర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా తర్వాత కోర్సులను ప్రారంభించనున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించింది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్ సీఐ)లో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది. ముందుగా హెల్త్ కేర్, ఈ–కామర్స్ అండ్ లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఏఐజీ, లెన్స్ కార్ట్, ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్, అల్కార్గో, ప్రొకనెక్ట్, ఓ9 సొల్యూషన్స్ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. సమావేశంలో బోర్డు సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, అధికారులు పాల్గొన్నారు.