ఆపదలో అండగా క్యూ ఆర్టీలు

ఆపదలో అండగా క్యూ ఆర్టీలు
  • జిల్లాలో మూడు టీంల ఏర్పాటు
  • సంఘటన జరిగిన వెంటనే స్పీడ్​గా రెస్పాండ్​
  • పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి

మెదక్, వెలుగు: ప్రకృతి విపత్తులు సంభవించి ప్రజలు అపాయంలో ఉన్నప్పుడు తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడేందుకు ఎస్పీ ఉదయ్ కుమార్ జిల్లాలో మూడు క్విక్ రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు ఇద్దరు ఏఎస్ఐలు ఇన్​చార్జిగా ఉండగా, హెడ్ కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులను మెంబర్లుగా నియమించారు. సంఘటన జరిగిన వెంటనే స్పీడ్​గా రెస్పాండ్​కావడం, పెద్ద ఎత్తున నిరసనలు జరగడం లేదా లా అండ్​ఆర్డర్ కు విఘాతం కలిగిన పరిస్థితిలో సాయం అందించడం ఈ బృందాల పని.

జిల్లాను ఈ బృందాలు నిరంతర పర్యవేక్షిస్తుంటాయి. ప్రధానంగా చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిఘా పెడుతాయి. జిల్లాలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగిన వెంటనే స్పందించి అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు కృషి చేస్తాయి.  

ఏడుపాయల వద్ద అలర్ట్​ 

సంగారెడ్డి జిల్లాలోని సింగూర్​ప్రాజెక్ట్​గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గా ప్రాజెక్ట్​(ఘనపూర్​ఆనకట్ట) పై నుంచి నీరు పొంగి పొర్లుతుండడంతో భవానీ  మాత ఆలయం చుట్టూ నీరు చేరింది. ఇక్కడ ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు, భక్తులు  ప్రమాదవశాత్తు నీటిలో పడే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ప్రమాదంలో పడితే రక్షించేందుకు వనదుర్గా ప్రాజెక్ట్​, ఏడుపాయల ఆలయం వద్ద  క్యూఆర్టీ టీంలను నియమించారు.  

డీజీపీ ప్రశంస

ఆపత్కాలంలో ప్రజల ప్రాణ రక్షణ కోసం జిల్లాలో క్యూఆర్టీ టీంలను ఏర్పాటు చేయాడాన్ని డీజీపీ జితేందర్​రెడ్డి అభినందించారు. ఇటీవల టేక్మాల్​ మండలంలో వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన క్యూఆర్టీ పోలీసులను ఆయన మెచ్చుకున్నారు. ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి వ్యక్తిని రక్షించిన క్యూఆర్టీ మెంబర్​మహేశ్ ను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించి రివార్డు అందజేశారు. 

Also Read :- బ్రిడ్జిలకు రిపేర్లు కరువు

కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన క్యూఆర్టీ పోలీసులు

ఇటీవల భారీ వర్షాలకు టేక్మాల్ మండల పరిధి గుండువాగు ఉధృతంగా ప్రవహిస్తున్న సమయంలో వాగు దాటేందుకు ప్రయత్నించిన నంద్యా నాయక్​ అనే యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. మధ్యలో ఓ బండరాయిని పట్టుకుని ఆగిపోయాడు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బయటకు రాలేకపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న క్విక్​రియాక్షన్​టీం సంఘటన స్థలానికి చేరుకుంది. టీం సభ్యులైన పోలీసులు తాడు సాయంతో రిస్క్​చేసి నంద్యాను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.